ఊహించని పేరు తెరపైకి: అద్వానీకి మోడీ గురుదక్షిణ మాటేమిటి?
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరు తెరపైకి వచ్చింది. బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ గోవింద్ పేరును బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఊహించని పేరు తెరపైకి వచ్చింది. బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ గోవింద్ పేరును బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రకటించారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు
అయితే బిజెపి అగ్రనేత, ఆ పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చిన అద్వానీకి మరోసారి చేదు అనుభవం ఎదురయిందని అంటున్నారు. 2014కు ముందు ఆయన ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నారు. కానీ నరేంద్ర మోడీకి అవకాశం దక్కింది.
బాబ్రీ కేసుతో మొదటి చిక్కు
ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా అద్వానీని ప్రకటిస్తారనే చర్చ ప్రారంభంలో సాగింది. ఆ తర్వాత బాబ్రీ కేసు నేపథ్యంలో ఆయన పేరు వెనక్కి పోయింది. మళ్లీ సోమవారం అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది.
జోరుగా ప్రచారం.. నిరాశ
అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ప్రకటించనున్నట్లు ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ రామ్నాథ్ పేరును అమిత్ షా ప్రకటించారు. దీంతో, అద్వానీకి చివరిసారిగా కూడా నిరాశే ఎదురయిందని అంటున్నారు. రామ్నాథ్ పేరును ప్రకటించడంతో బిజెపిలో అద్వానీ శకం ఇక ముగిసినట్టేనని అంటున్నారు.
అద్వానీకి మోడీ గురుదక్షిణ మాటేమిటి?
నరేంద్ర మోడీ ప్రధానిగా ఎదగడానికి అద్వానీ కారణం. గోద్రా అల్లర్ల సమయంలో నాటి ప్రధాని వాజపేయి గుజరాత్ సీఎంగా మోడీని తప్పిద్దామంటే అద్వానీ మాత్రం అండగా నిలబడ్డారు. దీంతో మోడీ గుజరాత్కు నాలుగుసార్లు సీఎం అయ్యారు. అయితే 2014లో అద్వానీ ప్రధాని అయ్యేందుకు మోడీ అడ్డయ్యారు. ఇరువురు నేతల మధ్య విభేదాలు కూడా కనిపించాయి.
గురు దక్షిణ ఏది?
అయితే, అద్వానీ అంటే మోడీకి మాత్రం అభిమానం ఉంది. ఈ కారణంగానే ఇటీవల గుజరాత్ పర్యటనలో.. అద్వానీకి తాను గురుదక్షిణ సమర్పించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. అంటే అద్వానీని రాష్ట్రపతి చేసేందుకే ఆ వ్యాఖ్యలు అన్నారని భావించారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు రామ్నాథ్ పేరు తెరపైకి వచ్చింది.