ప్రత్యేక హోదా ఏదీ..? సభలో ఎందుకు మాట్లాడలే.. మోడీకి తేజస్వి యాదవ్ ప్రశ్న
బీహర్ తొలి విడత పోలింగ్కు సమయం సమీపిస్తోన్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. శుక్రవారం ప్రధాని మోడీ ససరాంలో పర్యటించారు. సీఎం నితీశ్ కుమార్తో కలిసి వేదిక పంచుకున్నారు. విపక్షాలపై విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాలు కూడా అదేస్థాయిలో స్పందించాయి.
బీహర్ ప్రచార పర్వంలో ప్రజలు ఆశగా ఎదురుచూశారని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఇకనైనా ప్రత్యేక హోదా గురించి మోడీ ప్రస్తావిస్తారని అనుకొన్నారని తెలిపారు. కానీ వారి ఆశలపై మోడీ మరోసారి నీళ్లు చల్లారని విరుచుకుపడ్డారు. స్పెషల్ స్టేటస్ కోసం బీహారీలు కళ్లప్పగించుకొని చూస్తున్నారని పేర్కొన్నారు. కానీ మోడీ మాత్రం ప్రసంగంలో హామీ ఇవ్వలేదు. పైగా నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
అవినీతిని సమూలంగా నిర్మూలించారని, కరోనా వైరస్ నివారణలో కూడా చక్కగా పనిచేశారని మోడీ కొనియాడారు. నితీశ్ హయాంలో అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నారని పేర్కొన్నారు. ఇక ఇక్కడ లాంతర్ అవసరం లేదన్నారు. అయితే లాంతర్ ఆర్జేడీ గుర్తు కావడం విశేషం. బీహర్లో మరో 12 ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల కోసం దర్భాంగ, ముజఫర్ నగర్, పాట్నా.. నవంబర్ 3వ తేదీన చాప్రా, తూర్పు చంపారన్, సమస్తీపూర్, పశ్చిమ సమస్తిపూర్, సహస్ర, ఆరారియాలో మోడీ ర్యాలీ తీస్తారు.
Recommended Video
మరోవైపు ఉద్యోగాల అంశాన్ని కూడా తేజస్వీ గుర్తుచేశారు. బీహర్ యువతకు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగారు.