మనుషులా..పశువులా: భర్తను కట్టేసి కళ్లముందే భార్య, కూతురిపై అత్యాచారం
బీహార్ : బీహార్ క్రైమ్లకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. తాజాగా గయా జిల్లాలో ఓ వైద్యుడిని చెట్టుకు కట్టేసి.. అతని భార్య, కుమార్తెలపై అత్యాచారం చేశారు కొందరు మృగాళ్లు. ఈ ఘటనతో గయా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వివరాల్లోకి వెళితే... సోందియా గ్రామంలో తన విధులు నిర్వర్తించుకుని భార్యా, కుమార్తెలతో కలిసి తన మోటార్ సైకిల్ మీద ఇంటికి బయలు దేరాడు ఓ వైద్యుడు. జనసంచారం లేని ప్రాంతానికి వీరు చేరుకోగానే అక్కడ 20 మంది దుండగులు వైద్యుడిని ఆపి మారణాయుధాలతో బెదరించారు. వైద్యుడిని చెట్టుకు కట్టేసి ఆయన కళ్లముందే అతని భార్య కుమార్తెలపై అత్యాచారానికి పాల్పడి అక్కడ నుంచి పారిపోయారు.
పారిపోయే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే అందరిని చంపేస్తామని దుండగులు బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై డాక్టరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన రెండు గంటల్లోనే 20 మంది అనుమానితులను అరెస్టు చేశారు. బాధితులను చికిత్స కోసం అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.
20 మంది అనుమానితుల్లో ఇద్దరిని వైద్యుడు గుర్తుపట్టగా.. మిగతా 18 మంది ఈ దారుణానికి పాల్పడే సమయంలో తమ ముఖాలను రుమాలుతో కప్పుకున్నట్లు తెలిపాడు. పోలీసులు ఇంకా గ్రామంలోనే పహార కాస్తున్నారు. అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై ఆర్జేడీ నేత మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ స్పందించారు. బీజేపీతో నితీష్ కుమార్ ప్రభుత్వం చేతులు కలిపాక బీహార్లో శాంతిభద్రతలు గాడి తప్పాయని మండిపడ్డారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.