హత్యా? ఆత్మహత్యా?: రైల్వే ట్రాక్పై జిల్లా కలెక్టర్ మృతదేహం
బీహార్కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో రైల్వేట్రాక్ పక్కన సదరు కలెక్టర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఘజియాబాద్: బీహార్కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉత్తర్ప్రదేశ్లోని ఘజియాబాద్లో రైల్వేట్రాక్ పక్కన సదరు కలెక్టర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాం పక్కన సూసైడ్ నోట్ కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ముకేశ్ పాండే.. బక్సర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి ఘజియాబాద్లోని ఓ రైల్వే ట్రాక్ పక్కన ముకేశ్ మృతదేహం ఛిద్రమైన స్థితిలో కన్పించింది. మృతదేహం పక్కనే ఓ సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించారు.
'పశ్చిమ ఢిల్లీలోని జనక్పురి ప్రాంతంలోని భవనం 10వ అంతస్తు నుంచి దూకి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. మానవ మనుగడపై నమ్మకం పోయింది. నా సూసైడ్ నోట్ను ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో 742 నంబర్ గదిలో ఉంచిన నైక్ బ్యాగులో పెడుతున్నాను. ఐ లవ్ యూ ఆల్.. నన్ను క్షమించండి' అని సదరు లేఖలో ముకేష్ పేర్కొన్నట్లు ఉంది.
అయితే ముకేశ్ ఆత్మహత్యగానే భావిస్తున్న పోలీసులు.. ఆయన ఎప్పుడు, ఎక్కడ చనిపోయారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సూసైడ్ నోట్లో తాను ఢిల్లీలో చనిపోతున్నానని పేర్కొనగా.. మృతదేహం మాత్రం ఘజియాబాద్లో దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
కాగా, చనిపోడానికి ముందు ముకేశ్ తాను మాల్పై నుంచి దూకి చనిపోతున్నట్లు వాట్సాప్ ద్వారా తన స్నేహితుడికి చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ముకేశ్ స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే ఆ మాల్కు వెళ్లారు. అయితే అక్కడ ముఖేశ్ కనబడలేదని పోలీసులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజ్లోనూ ముకేశ్ మాల్ నుంచి మెట్రో స్టేషన్ వైపుగా వెళ్తున్నట్లు ఉందని, అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. కాగా, రైలు కింద పడి ముకేశే ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేశారా? అనే విషయం తేలాల్సి ఉంది.