పాక్తో పోరాడుతాం.. చనిపోతే అమరులం, బతికితే జైలుకు: రూ.50 వేలిచ్చి, మోడీకి లేఖ రాసిన ఖైదీలు
పాట్నా: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఆర్మీ రిలీఫ్ ఫండ్ (ఏఆర్ఎఫ్)కు బీహార్లోని గోపాల్గంజ్ సబ్ డివిజనల్ జైలు అధికారులు, ఖైదీలు రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ఏఆర్ఎఫ్కు డీడీని పంపించింది. సోమవారం మధ్యాహ్నం రిజిస్టర్ పోస్ట్ ద్వారా దీనిని పంపించింది.
ఈ జైలులోల 750 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 30 మంది మహిళా ఖైదీలు. ఇందులో 102 మంది నేరస్థులు. పుల్వామా తీవ్రవాద దాడిని జైలులోని ఖైదులు రోజు చూస్తున్నారని, దేశం కోసం జవాన్లు చేసిన త్యాగానికి వారు తమ వంతుగా ఎంతో కొంత విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారని జైలు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఖైదీలు, జైలు అధికారులు కలిసి రూ.50వేలు ఆర్మీ రిలీఫ్ ఫండ్కు పంపించారు.
హృదయం ద్రవించేలా లేఖ
అంతేకాదు, జైల్లోని 250 మంది ఖైదీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ కూడా రాశారు. భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో శత్రువులతో తాము పోరాడేందుకు తాము సిద్ధమని ఈ మేరకు ఆ ఖైదీలు తమ సంతకాలతో కూడిన లేఖను ప్రధానికి పంపించారు. అందరి హృదయం ద్రవించేలా వారు ఆ లేఖ రాశారు.
శత్రువులతో పోరాడుతాం.. చస్తే అమరులం.. బతికితే తిరిగి జైలుకు వస్తాం
శత్రవులతో (పాక్) పోరాడి ఆ యుద్ధంలో తాము మరణిస్తే తాము అమరవీరులుగా మిగిలిపోతామని, లేదా ఆ యుద్ధంలో తాము బతికి ఉంటే తిరిగి ఇదే జైలుకు వచ్చి ఉంటామని పేర్కొన్నారు. తాము యుద్ధంలో బతికితే కనుక అధికారులకు, పోలీసులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తాము తిరిగి ఈ నాలుగు గోడల జైలుకు వస్తామని చెప్పారు.
వారి విరాళం వెలకట్టలేనిది
దీనిపై జైలు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. జైల్లోని వారు బయట పని చేసేందుకు చట్టంలో ఎలాంటి వెసులుబాటు లేదని చెప్పారు. కానీ జైల్లోని ఖైదీలు తమ జీవితం ముగిస్తే అర్థవంతంగా ముగిసిపోవాలని, దేశం కోసం పని చేయాలని ఆ లేఖ రాశారన్నారు. జైల్లోని ఖైదులు ఇచ్చిన రూ.50వేలు చిన్నమొత్తం కావొచ్చునని, కానీ వారు ఇచ్చిన విరాళం, వారు చూపిన అభిమానం మాత్రం వెలకట్టలేనిదని కితాబిచ్చారు. జైల్లో వివిధ పనుల ద్వారా ఖైదీలు డబ్బులు సంపాదించారని చెప్పారు. జైల్లో కూరగాయలు, పూవులు పండిస్తామని, ఖైదీలు వీటిని చూసుకుంటారని, వీటి ద్వారా ఒక్కో ఖైదీ రూ.3వేల నుంచి రూ.3500వేల వరకు సంపాదిస్తారని చెప్పారు.