తండ్రిని కిరాయి హంతకులతో చంపించిన కొడుకు, ఎందుకో తెలుసా?
పాట్నా: తండ్రి చేసే ఉద్యోగం కోసం ఓ కసాయి కొడుకు కిరాయి హంతకులకు సుఫారీ ఇచ్చి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంతో ఈ హత్యకు గల కారణాలను తెలుసుకొని షాక్కు గురయ్యారు.
బీహార్ రాష్ట్రంలోని ముంగేర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ మండల్ ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా ఆఫీసర్స్ క్లబ్ రోడ్డులో కిరాయి హంతకులు కాల్చి చంపారు. ఒంప్రకాష్ హత్యకు సంబంధించిన కేసును విచారించిన పోలీసులకు షాక్ తిన్నారు.
ఓంప్రకాష్పై కాల్పులు జరిపిన వ్యక్తిని షూటర్ రవి రంజన్ గా పోలీసులు గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయమై అతడిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
రైల్వే ఉద్యోగి అయిన ఓంప్రకాష్ ఏప్రిల్ 30వతేదీన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అతని కుమారుడు పవన్ మండల్ ఎన్ని పోటీ పరీక్షలు రాసినా ప్రభుత్వ ఉద్యోగం లభించక పోవడంతో తండ్రిని చంపిస్తే తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం వస్తుందని భావించాడు.
తండ్రి హత్యకు కుమారుడు సుపారీ ఇచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పవన్ కిరాయిహంతకులతో రెండులక్షల రూపాయలకు సుపారీ మాట్లాడుకొని సగం డబ్బులు ఇచ్చాడని వెల్లడైంది. రవిరంజన్, సునీల్ మండల్ లతోపాటు పవన్, మధ్యవర్తులు విక్కీ, జుగ్నులను అరెస్టు చేశామని పోలీసు అధికారి ముహమ్మద్ అలీ సాబ్రీ వెల్లడించారు.