సరిహద్దులో నేపాల్ బరితెగింపు: భారతీయులపై కాల్పులు, ఒకరికి గాయాలు
పాట్నా: సరిహద్దులో నేపాల్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతమైన బీహార్లోని కిషన్గంజ్ వద్ద ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో భారతీయ పౌరుడు గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు.
Recommended Video
ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు కిషన్ గంజ్ ఎస్పీ తెలిపారు. భారత్లో అంతర్భాగమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ తమ దేశ మ్యాప్లో చూపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో భారత్.. నేపాల్ చేసిన పనిని తీవ్రంగా ఖండించింది. తమ భూభాగాలను మీ దేశ మ్యాప్లో ఎలా చూపిస్తారని నేపాల్ను ప్రశ్నించింది. తాము ఆ పటాన్ని గుర్తించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నేపాల్ పోలీసులు భారతీయులపై కాల్పులకు తెగపడటం మరింత ఉద్రిక్తతకు దారితీస్తోంది.
ఇప్పటికే మనదేశంపై పలు రకాలుగా నేపాల్ తన అక్కసును వెల్లదీస్తోంది. పలు భారతీయ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలపైనా ఆంక్షలు విధించింది. చైనా కంటే భారత్ కరోనా వైరస్సే ప్రమాదకరమంటూ వింత వ్యాఖ్యలు కూడా చేశారు.
చైనా అండతో రెచ్చిపోతోంది. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల మాట్లాడుతూ.. అయోధ్య నేపాల్ లోనే ఉందని, శ్రీరాముడు కూడా నేపాల్లోనే పుట్టాడంటూ మరో వివాదానికి తెరతీశారు. దీంతో ఓలిపై నలువైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొంది.