అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేత
పాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేసినట్టుగానే- బిహార్లో కూడా ఓ పార్టీ నాయకుడు విధ్వంసానికి దిగాడు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని పగులగొట్టాడు. దాన్ని నేలకేసి విసిరికొట్టాడు. అతణ్ని రంజిత్ పాశ్వాన్గా గుర్తించారు పోలీసులు. అరెస్టు చేశారు. కేసు నమోదు చేశారు. లోక్ జనశక్తి పార్టీ నాయకుడని చెబుతున్నారు స్థానికులు. బిహార్లోని ఛాప్రా జిల్లాలోని 131 నంబర్ పోలింగ్ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గుంతకల్లులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయనే కారణంతో- మధుసూదన్ గుప్తా గుంతకల్లులో ఓ ఈవీఎంను పగులగొట్టిన ఉదంతం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అచ్చు అలాంటి ఘటనే ఛాప్రాలో కూడా చోటు చేసుకుంది. ఛాప్రా లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున చంద్రికా రాయ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ-లోక్ జనశక్తి-జనతాదళ్ (యునైటెడ్) పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పొత్తు ఉన్న నేపథ్యంలో లోక్ జనశక్తి పార్టీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించలేదు.
అయిదో విడత పోలింగ్ సందర్భంగా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 51 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్, బిహార్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్లల్లోని వివిధ నియోజకవర్గాల్లో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ను నిర్వహిస్తారు.