చేతికి చిక్కిన దొంగ: 14 కేజీల బంగారం హాంఫట్
పాట్నా: గుట్టు చప్పుడు కాకుండా 14 కేజీల బంగారం చోరీ చేసిన నిందితుడిని బీహార్ లో పోలీసులు అరెస్టు చేశారు. అర్జున్ రామ్ అనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శుక్రవారం రాజ్ కోట్ ఎస్పీ శివదీప్ లాండే తెలిపారు. అయితే నిందితుడు చోరీ చేసిన 14 కేజీల బంగారం ఎక్కడ పెట్టాడనేది తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన బంగారు నగల వ్యాపారి దగ్గర అర్జున్ రామ్ పని చేసేవాడు. గత సంవత్సరం యజమాని కళ్లు గప్పిన నిందితుడు అర్జున్ రామ్ 14 కేజీల బంగారం చోరీ చేసి మాయం అయ్యాడు. బంగారు నగల వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు అర్జున్ రామ్ గురించి ఆరా తీశారు. తరువాత అర్జున్ రామ్ బీహార్ లోని రోహతస్ జిల్లాలోని దుమారియా గ్రామానికి చెందినవాడు అని గుర్తించారు. గురువారం అర్జున్ రామ్ గ్రామం మీద దాడి చేసిన పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
అర్జున్ రామ్ నివాసంలో గాలించినా ఒక్క బంగారం ముక్క పోలీసులకు చిక్కలేదు. ఇతను బంగారం ఎక్కడ పెట్టాడు అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అర్జుమ్ రామ్ ను పట్టుకున్న పోలీసులకు తాను రూ. ఒక లక్ష బహుమానంగా అందిస్తానని చోరీ జరిగిన సమయంలో వ్యాపారవేత ప్రకటించారు. చెప్పినట్లే ఆ రూ. లక్షను పోలీసులకు బహుమానంగా అందించారు.