దొంగను పట్టించిన హీరోయిన్ నయనతార: ఎలాగంటే...
పాట్నా: హీరోయిన్ నయనతార ఓ దొంగను పట్టించింది. అది కూడా బీహార్లో అది జరిగింది. చాలా విచిత్రంగా అది జరిగింది. దొంగను పట్టించడంలో ఆమె ప్రత్యక్ష పాత్ర ఏమీ లేదు. ఆమె పరోక్ష పాత్రనే పోషించింది.
బీహార్లోని దర్భంగాలో సంజయ్ కుమార్ అనే బీజేపీ నేత సెల్ఫోన్ను మొహమ్మద్ హసైన్ అనే ఓ దొంగ దొంగలించాడు. దానిపై సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాల్ సిగ్నల్స్ ఆధారంగా ఇలా...
కాల్ సిగ్నల్స్ ఆధారంగా ఆ ఫోన్ను అదే సిమ్తో దొంగ ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్నారు పోలీసులు. ఆ దొంగను పట్టుకోవడంలో తెలివిగా వ్యవహరించిన దర్బంగా దర్బంగా పోలీసు స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ మదుబాల దేవీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారారు.
ప్రేమ బాణం విసిరి ఇలా..
హసైన్పై మధుబాల దేవి ప్రేమ బాణం విసిరింది. ఫోన్ చేస్తే తొలుత పోలీసులు కావచ్చునని భయపడ్డాడు. కానీ ఆమె విసిరిన వలపు వలలో చిక్కుకున్నాడు. నాలుగు రోజుల పాటు మధుబాల దేవీకి, దొంగకు మధ్య సంభాషణలు కొనసాగాయి.
తన మాటల ద్వారా ముగ్గులోకి...
తన తీయటి మాటలతో దొంగను పూర్తిగా ముగ్గులోకి దించింది. ఆ తర్వాత ఓ రోజు కలుద్దామని కోరింది. మీ ఫొటో పంపాలని అతను కోరుడు. దాంతో ఆమె దక్షిణాది తార నయనతార ఫొటో పంపింది. ఆ ఫొటో చూడగానే అతను పూర్తిగా పడిపోయాడు.
భేటీ అంగీకరించాడు...
నయనతార ఫొటో చూసి మైమరిచిపోయిన దొంగ చెప్పిన చోటికి చెప్పిన సమయానికి టంచనుగా వచ్చేశాడు. సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ రకంగా నయనతార దొంగను పట్టుకోవడానికి దర్బంగా పోలీసులకు సాయపడింది. పోలీసులకు పట్టుబడిన తర్వాత తాను నేరం చేశానని హసైన్ అంగీకరంచాడు. మరో వ్యక్తి నుంచి దాన్ని రూ.4,500కు కొన్నట్లు చెప్పాడు. మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.