బీహార్లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులు
బీహార్ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ తమ తురుపుముక్కల్ని రంగంలోకి దించాయి. బీహార్ లో జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో పోటీచేస్తోన్న బీజేపీ సైతం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. సాధారణంగా మోదీ స్పీచ్ కు మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో విస్తృతమైన ప్రచారం ఉన్నప్పటికీ.. తొలిసారిగా ఆయన సభలో పాల్గొనే ఊరు చుట్టూ డిజిటల్ మాధ్యమాలతో ప్రసంగాన్ని ప్రజలకు చేరవేయనున్నారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మొత్తం 12 ర్యాలీల్లో పాల్గొంటారు. అక్టోబర్ 23న సాసారామ్, గయా, భగల్పూర్లలో జరిగే ఎన్నికల ర్యాలీల్లో ఆయన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. కొవిడ్ -19 నిబంధనల నేపథ్యంలో సభకు రాలేని ప్రజలకు మోదీ సందేశాన్ని చేరవసేలా ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి సభను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం తెలిపారు.
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈనెల 28న తొలి దశ, నవంబరు 3న రెండో దశ, నవంబరు 7న మూడో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ జనం ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. అంతేకాదు..
కేవలం ఎన్నికల కోసమే 46 లక్షల మాస్కులు, 6 లక్షల పీపీఈ కిట్లు, 7 లక్షల శానిటైజర్లు, 7.6 లక్షల ఫేస్ షీల్డ్స్, 23 లక్షల హ్యాండ్ గ్లవ్స్ అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్ సమయాన్ని కూడా గంట పెంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంగ్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మాస్కు ఉన్న వారిని మాత్రమే ఓటింగ్కు అనుమతిస్తారు. చివరి గంటలో కోవిడ్ రోగులకు ఓటువేసే అవకాశం కల్పిస్తారు.