కరోనా బారినపడి పూర్ణియా పోలీస్ ఐజీ కన్నుమూత
లక్నో: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు రాజకీయ, సినీప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులనూ వదిలిపెట్టడం లేదు. తాజాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ కరోనా బారినపడి కన్నుమూశారు.
పూర్నియాలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. ఆదివారం ఉదయం పాట్నా ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పాట్నాలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఇటీవల ఇద్దరు బీహార్ మంత్రులు కరోనా బారినపడి మృతి చెందారు. జేడీయూ నేత, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ డియో కామత్(69), బీజేపీ నేత, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కుమార్ సింగ్(5) కోవిడ్ 19 బారినపడి మరణించారు.
బీహార్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,03,060 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,554 యాక్టివ్ కేసులున్నాయి. 1,91,515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 990 మంది కరోనా బారినపడి మరణించారు.
ఇక దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు 74లక్షలు దాటాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8 లక్షలకు చేరువలో ఉన్నాయి. 65 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి లక్ష మందికిపైగా మరణించారు.