సీఎం అభ్యర్ధిగా నేనుంటే: 'సిన్హాను కుక్కతో పోల్చాడు'
ముంబై: బీజేపీ తరుపున బీహార్ సీఎం అభ్యర్ధిగా తన పేరును ప్రకటించి ఉంటే ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని సోమవారం నటుడు, ఎంపీ శత్రుఘ్నసిన్హా సోమవారం స్పష్టం చేశారు. ఇండియా టీవీ చానల్లో ప్రసారమయ్యే ఆప్కీ అదాలత్ అనే కార్యక్రమంలో శత్రు ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు చానల్ ఓ ప్రకటనలో తెలిపింది.
‘నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు. బిహార్ ప్రజల ముద్దుబిడ్డ, అసలు సిసలైన బిహారీ బాబునైన నన్ను ఉద్ధేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని స్వయంగా నాకే అనిపించింది. నా మద్దతుదారులు, అభిమానులపై ఇది కచ్చితంగా దుష్ప్రభావం చూపింది. ఇలా జరగకుండా ఉంటే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరుగా ఉండేవి. ఎంత తేడా ఉండేదో నేను చెప్పలేను. కానీ ప్రస్తుతం అక్కడ లభించిన సీట్ల కంటే బిజెపి మరిన్ని సీట్లను కైవసం చేసుకుని ఉండేది' అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల మీరు అసంతృప్తితో ఉన్నారా? అని ప్రశ్నించగా, ఇవన్నీ కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న మాటలని, ఎన్నో పదవులను కైవసం చేసుకున్న కొంత మంది వ్యక్తులు మంత్రి పదవి లభించకపోవడం పట్ల తాను అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని శతృఘ్న సిన్హా చెప్పారు.
కాగా, పట్నాలో ఆయన ముఖ్యమంత్రి నితీశ్కుమార్ను కలసి, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్లో బీజేపీ ఘోరంగా ఓడిపోవడానికి కారకులైన నాయకులు గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఓటమికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆర్జేడీనేత లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా శత్రుఘ్నసిన్హా కలిసి కింగ్మేకర్గా అవతరించారంటూ అభినందించారు. ఇదిలా ఉంటే శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తీవ్రంగా స్పందించారు. శత్రుఘ్నసిన్హాను ఆయన కుక్కతో పోల్చారు.