'గౌరవిస్తాం, సామాజిక సమీకరణాలే కలిసొచ్చాయి'
పాట్నా: బీహార్ ప్రజల తీర్పుని గౌరవిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై సమగ్రంగా విశ్లేషించుకుంటామని ఆయన తెలిపారు. సోమవారం రాజకీయ కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీహార్లో బీజేపీ ఓటమితో దేశమంతా ఇటువంటి పరిస్థితే ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. బీహార్లో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఒక రాష్ట్రంలోని ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించడం సరికాదని ప్రతిపక్షాలకు సూచించారు. బీహార్లో మాత్రమే ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ఎటువంటి ఆటంకం కలగదనే అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు విపక్షాలకు కలిసివచ్చాయన్నారు.
బీహార్ లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా ఐదు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికల్లో అత్యధికంగా 56.8 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల బరిలో మొత్తం 3450 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఆదివారం ఓట్ల లెక్కింపులో మహా కూటమి 178 స్థానాల్లో విజయం సాధించగా, ఎన్డీఏకు 58 స్థానాలు మాత్రమే దక్కాయి. 14 జిల్లాల్లో బీజేపీ అసలు ఖాతానే తెరవలేదు.