బీహార్ అభివృద్ధిని కొందరు ఓర్వలేకపోతున్నారు: ప్రతిపక్షాలపై నితీష్ కుమార్ సెటైర్లు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీహార్ సీఎం, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ ప్రచార జోరును పెంచారు. వర్చువల్ ర్యాలీలో మంగళవారం నితీష్ కుమార్ ప్రసంగించారు.
Bihar elections 2020: నితీష్ కుమార్ రెండో విజన్ డాక్యుమెంట్, విద్య, ఉద్యోగాలు
దేశంలోనే బీహార్ అభివృద్ధి రేటు అధికంగా ఉందని, ఈ విషయం కొంతమందికి నచ్చడం లేదని, అసూయ పడుతున్నారని ప్రతిపక్షాలపై నితీష్ కుమార్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా సీఎం నితీష్ వివరించారు.
ఒకప్పుడు నేరాలకు కేరాఫ్ అడ్రస్గా ఉండే బీహార్.. తమ పరిపాలన వచ్చాక ఇప్పుడు క్రైమ్ కేసుల జాబితాలో దేశంలో 23వ స్థానానికి తగ్గిందన్నారు. ఇది ఇలావుండగా, సుశీల్ కుమార్ మోడీ, సంజయ్ జైస్వాల్, భూపేంద్ర యాదవ్, నిత్యానంద్ రాయ్లు బీజేపీ తరపున ప్రచారం నిర్వహించారు.
ఇటీవల నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీహార్ మాజీ సీఎంలు, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు సీఎం నితీష్ కుమార్. లాలూ దంపతుల పాలనలో బీహార్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. బీహార్ను జంగిల్ రాజ్గా మార్చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాకే బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని నితీష్ స్పష్టం చేశారు.
Recommended Video
మహిళా సాధికరత కోసం ఇంటర్మీడియట్ చదివిన మహిళలకు రూ. 25వేలు, డిగ్రీ చదివిన మహిళలకు రూ. 50వేల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్తిగా నితీష్ కుమార్ పోటీ చేస్తుండగా, ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు కూటములు కూడా పలువురు అభ్యర్థులను ప్రకటించారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.