అతిపెద్ద హిందూ ఆలయ నిర్మాణానికి భూమి ఇచ్చిన ముస్లీంలు
పాట్నా: చాలామంది ముస్లీంలు హిందూ ఆలయం నిర్మాణం కోసం అవసరమైన కొంత భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారని కిశోర్ కునాల్ అనే మాజీ ఇండియన్ పోలీసు సర్వీస్ అధికారి చెప్పారు. బీహార్ రాష్ట్రంలో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మిస్తున్నారు.
దీనికి పలువురు ముస్లీంలు భూమిని ఇస్తున్నారు. అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు స్థలాన్ని బహూకరించడం గమనార్హం. బీహార్లో మహావీర్ మందిర్ ట్రస్టు ఆధ్వర్యంలో 20 వేలమంది ఒకేచోట కూర్చుని కార్యక్రమాలు తిలకించేలా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందూ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.
అందుకు కావాల్సిన స్థలాన్ని అక్కడి ముస్లీం సోదరులు పలువురు విరాళంగా అందజేశారని, మరికొందరు నామమాత్రపు రుసుము తీసుకుని ఇచ్చారని మాజీ ఐపీఎస్ అధికారి, ట్రస్టు సభ్యులు కిశోర్ కునాల్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు ముస్లీం సోదరుల సహకారం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణ పనులను జూన్ నుంచి ప్రారంభిస్తామని, ఇందుకోసం రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విరాట్ రామ్ మందిర్గా పేర్కొంటున్న ఈ ఆలయాన్ని భూకంపాన్ని తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో రాముడు, సీత, లవ, కుశుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తామన్నారు.