విద్యార్థుల మృతి: స్కూల్ డైరెక్టర్ను కొట్టి చంపారు
బీహార్: రాష్ట్రంలోని నలంద జిల్లా నిర్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థుల మృతికి కారణమంటూ ఓ పాఠశాల డైరెక్టర్ను స్థానికులు కొట్టి చంపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఓ మురుగు కాలువలో చనిపోయి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పాఠశాలపై దాడి చేశారు. భారీ విధ్వంసం సృష్టించారు.
బ్రాంచ్ డైరెక్టర్ దేవేంద్ర ప్రసాద్ ఆ విద్యార్థులను కొట్టి చంపారని ఆరోపిస్తూ ఆయనను చావబాదారు. డైరెక్టర్ను అతి పాశవికంగా కర్రలతో, లాఠీలతో కొట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
భారీగా చేరుకున్న స్థానికులను చెదరగొట్టడం అక్కడున్న పోలీసుల వల్ల కాలేదు. దీంతో డిఎస్పీ ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న పోలీసులు చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
తీవ్రగాయాలపాలైన దేవేంద్ర ప్రసాద్ను పోలీసులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డైరెక్టర్ మరణించారు. ఈ ఘటన అనంతరం కూడా గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. డైరెక్టర్పై దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.