మనుషులా..పశువులా: న్యాయం కోసం వెళితే ఆమెపై ప్రిన్సిపాల్ అత్యాచారం చేశాడు
బీహార్లో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థినిపై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది గత 8 నెలలుగా అత్యాచారం చేశారు. ఇందులో ఆమె చదివే స్కూలుకే చెందిన విద్యార్థులుండగా...మిగతా వారు ఆమెకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు. ఇంకా ఛీ అనిపించే విషయం ఏమిటంటే న్యాయం చేస్తాడని ప్రధానోపాధ్యాయుడి దగ్గరకు వెళితే ఆ దుర్మార్గుడు కూడా కామంతో కాటేశాడు.
సరన్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరులో ముగ్గురు విద్యార్థులు ముందుగా ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఈ ఘటనను వీడియోకూడా తీసి బయట ఎవరికైనా చెబితే వీడియో అందరికీ షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ బాలిక బెదిరిపోయి జరిగిన దారుణాన్ని ఎక్కడా చెప్పలేదు. అయితే కొన్ని రోజులకు వీడియోను ఆ విద్యార్థులు తమ మిత్రులకు షేర్ చేశారు. ఇది తెలుసుకున్న బాధితురాలు న్యాయం కోసం టీచర్ల దగ్గరకు వెళ్లింది. దీన్ని అవకాశంగా తీసుకున్న దుర్మార్గపు టీచర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జరిగిన ఉందంతాన్ని స్కూలు ప్రిన్సిపల్కు చెప్పగా... ఈ దారుణం గురించి బయట చెబితే స్కూలుకు చెడ్డపేరు వస్తుందని చెప్పాడే తప్పితే ఆ బాలికకు న్యాయం చేద్దామన్న ఇంకిత జ్ఞానం లేక పోయింది. ఇదే అవకాశంగా భావించిన ఆ కిరాతక ప్రిన్సిపాల్ బాలికపై అత్యాచారం చేశాడు.
ఇంత జరిగాకా తనకు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో ధైర్యం తెచ్చుకుని జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 18 మంది పేర్లను బాధితురాలు బయటపెట్టింది. ఇందులో ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ అలియాస్ ముకుంద్ సింగ్, టీచర్ బాలాజీలను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మహిళలపై నేరాల సంఖ్య బీహార్లో అత్యధికంగా ఉంది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే 127 మంది మైనర్లు, మహిళలపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరుకల్లా ఈ సంఖ్య రెట్టింపు అయ్యింది.