‘హైటెక్’ మాస్ కాపీయింగ్: దొరికిన 8మంది అమ్మాయిలు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో ఇటీవల మాస్ కాపీయింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఘటనలో అబ్బాయిలతోపాటు అమ్మాయిలు కూడా దొరికిపోయారు. కాపీ కొడుతూ అరెస్టైన 13మందిలో 8మంది అమ్మాయిలు ఉండటం గమనార్హం.
ఆదివారం జరిగిన బీహార్ కంబైన్డ్ ఎంట్రాన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్(బిసిఈసిఈబి) పరీక్షల్లో పాట్నాలోని వేర్వేరు కేంద్రాల్లో ఉన్నత సాంకేతికత కల్గిన పరికరాలను ఉపయోగించి కాపీకొడుతున్న 13మంది అబ్బాయిలు, అమ్మాయిలు అరెస్ట్ అయ్యారు.
ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ కంబైన్డ్ పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తుంది. కాగా, కాపీ కొడుతూ అరెస్టైన 13మందిలో 8మంది అమ్మాయిలు ఉన్నారు. కాపీ కొడుతూ ఇంత పెద్ద సంఖ్యలో అమ్మాయిలు అరెస్టవడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
పట్టుబడిన ఎనిమిది మంది అమ్మాయిలది కూడా వేర్వేరు ప్రాంతాలు, వీరి దగ్గర నుంచి మైక్రో ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా తమకు ఈ విధంగా పరీక్షలు రాసేందుకు సహకరిస్తామని చెప్పిన ముఠాకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించామని అరెస్టైన అమ్మాయిల్లో ఒకరు తెలిపారు.
కాగా, ఇటీవల మెట్రిక్యూలేషన్ పరీక్షలు జరుగుతున్న సమయంలో పాఠశాల భవనాలపైకి ఎక్కి మరీ, పరీక్షలు రాస్తున్న వారికి నకలు చిట్టీలు అందించిన ఘటన మరువక ముందే మళ్లీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బీహార్లో సంచలనం సృష్టిస్తోంది.