సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వేడినిపుట్టిస్తున్నారు. తాజాగా, మహాగఠ్భంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్కు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ వైరల్ చేస్తోంది.
ఆ వీడియోలో తేజశ్వి యాదవ్ ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు భారీగా జనం వచ్చారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే, ఓ వ్యక్తి తన అభిమాన నేత తేజశ్వి యాదవ్తో సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చాడు. అయితే, తేజశ్వి యాదవ్.. అతడి చేతి పట్టుకుని గిరగిరా తిప్పి జనాల్లోకి తోసేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ట్విట్టర్లో పోస్టు చేసి తేజశ్విపై విమర్శలు ఎక్కుపెట్టారు. 'మొదటి దశ ఎన్నికల తర్వాత ఆర్జేడీ నాయకుడు ఇంత ఆందోళనకు గురైతే, ఎన్నికల ఫలితాలు ముగిసినప్పుడు అతను ఎంతగా ఆందోళన చేస్తాడు? 'జంగిల్ రాజ్' గురించి వ్యాఖ్యానిస్తూ.., తేజశ్వి అధికారంలోకి వస్తే.. మహాగఠబంధన్ నాయకుల వైఖరి ఇదే'అని బిజెపి హెచ్చరించింది.
కాగా, పదేపదే అభ్యర్ధనలు చేసినప్పటికీ తేజశ్వికి, ఆర్జేడీ ర్యాలీలకు అదనపు భద్రత కల్పించలేదని ఆర్జేడీ ఈసీపై విరుచుకుపడింది.
चुनाव के पहले ये हाल है तो बाद में तो #जंगलराज_का_युवराज डंडा लेकर ही निकलेंगे!@yadavtejashwi बाबू इतनी झल्लाहट किस बात की है, अभी तो 10 नवंबर का इंतजार करिए। पारा सातवें आसमान पर होगा आपका, ये तय है। pic.twitter.com/XaZEb6QqUX
— BJP Bihar (@BJP4Bihar) October 29, 2020
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 71 స్థానాల్లో పోలింగ్ అక్టోబర్ 28 న పూర్తయింది, ఓటింగ్ శాతం 54.26%. బీహార్ ఎన్నికలలో మిగిలిన రెండు దశలు నవంబర్ 3, నవంబర్ 7న జరగనున్నాయి. ఇక ఎన్నికల ఫలితాలు నవంబర్ 10 న విడుదల కానున్నాయి.