బీహార్ ఫస్ట్...బెంగాల్ సెకండ్: ఎంపీలు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
ఢిల్లీ: దేశంలోని ప్రజాప్రతినిధులపై ఉన్న పెండింగ్ క్రిమినల్ కేసుల్లో మొదటి స్థానంలో బీహార్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో పశ్చిమ బెంగాల్, కేరళలు వరసుగా రెండూ మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని ఎంపీలు ఎమ్మెల్యేలపై పెండింగ్లో క్రిమినల్ కేసులపై కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. ఇందులో మొత్తం 1,233 కేసులు ప్రత్యేక కోర్టులకు బదిలీ అయ్యాయి. ఈ ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటయ్యాయి. ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు చేయడంతో 136 కేసులు మాత్రమే విచారణ ముగిసింది. మరో 1097 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
కర్ణాటకలో 215 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు, క్రిమనల్ కేసుల్లో కూడ టాప్
బీహార్లో 260 కేసులు ప్రత్యేక కోర్టులకు బదిలీ అయ్యాయి. గత ఆరు నెలల్లో 11 కేసులను న్యాయస్థానం కొట్టివేయగా మరో 249 కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కేసుల విచారణలో అత్యంత ఉదసీనతతో వ్యవహరిస్తోంది పశ్చిమ బెంగాల్. ఎంపీలు ఎమ్మెల్యేలపై మార్చి 2018లో మొత్తం 215 కేసులు నమోదవగా... ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా విచారణ పూర్తికాలేదు.మరోవైపు కేరళలో 178 కేసులపై స్పష్టత లేదు. వాటిని కొట్టివేశారా లేక అవి పెండింగ్లో ఉన్నాయా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. కేరళ తర్వాత నాలుగో స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ ప్రజాప్రతినిధులపై 157 కేసులుండగా... గత ఆరు నెలల్లో 44 కేసులను విచారణ చేసి క్లోజ్ చేశాయి న్యాయస్థానాలు.మరో 45 సీరియస్ కేసులను ట్రయల్ కోర్టులో విచారణ చేసి అందులో ఆరు కేసులను క్లోజ్ చేశాయి న్యాయస్థానాలు.
కర్నాటక ఎంపీలు ఎమ్మెల్యేలపై 142 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 19 కేసులపై తీర్పు వెల్లడించారు జడ్జి. తెలుగు రాష్ట్రాల్లో 64 పెండింగ్ కేసులుండగా... మహారాష్ట్రలో 50 , మధ్య ప్రదేశ్లో 28 పెండింగ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులను విచారణ చేసేందుకు 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫడవిట్లో తెలిపింది. ఇందులో ఆరు సెషన్ కోర్టులుండగా... ఐదు మెజిస్టేరియల్ కోర్టులని తెలిపింది. అయితే తమిళనాడు ఇంకా అక్కడ ఏర్పాటు అయిన కోర్టుల గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
అలహాబాద్ చెన్నై నగరాల్లో స్పెషల్ కోర్టులు ఏర్పాటు అయ్యాయి. అయితే అక్కడున్న పెండింగ్ కేసుల వివరాలు ఇంకా న్యాయశాఖకు చేరలేదు. మరోవైపు స్పెషల్ కోర్టు ఏర్పాటు విషయం మద్రాస్ హైకోర్టు వద్ద పెండింగ్లో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో ఏర్పాటైన స్పెషల్ కోర్టుల గురించి సమాచారం ఇవ్వాలని బీజేపీ నేత సుప్రీంకోర్టు లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ 2016లో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ను విచారణ చేసిన జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుని నిధులు కేటాయించాలని ఆదేశాలు జారీచేశారు. కేసును గురువారానికి వాయిదా వేశారు.