బీహార్లో మళ్లీ డబుల్ ఇంజిన్ -యువరాజులకు పరాభవం తప్పదు -తొలిదశ ఫలితం చెప్పిన మోదీ
రాజకీయాల్లో అవినీతి, వంశపారంపర్యతపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పదునైన వ్యాఖ్యలు చేశారు. తాతలు, తండ్రుల పేర్లు చెప్పుకుంటూ ఇంకా రాజకీయాల్లో కొనసాగుతోన్న నేతలను యువరాజులుగా అభివర్ణించిన ఆయన.. ఆ యువరాజులకు ప్రజల చేతిలో పరాభవం తప్పదని, సదరు నేతలకు గతంలో ఉత్తరప్రదేశ్ లో ఎదునైన అనుభవమే బీహార్ లోనూ తప్పదని, తొలి దశలోనూ ఇదే రుజువైందని జోస్యం చెప్పారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాంగా ప్రధాని మోదీ ఆదివారం నాలుగు బహిరంగ సభల్లో పాల్గొంటారు. తొలిగా ఛాప్రా నియోజకవర్గంలో మాట్లాడిన ఆయన.. విపక్ష మహాకూటమి నేతలపై విమర్శలు సంధిస్తూ, ఎన్డీఏ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం నితీశ్ కుమార్ బీహార్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఈసారి కూడా బీహార్ లో 'డబుల్ ఇంజన్(జేడీయూ, బీజేపీ) ప్రభుత్వమే ఏర్పాటవుతుందని మోదీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, వారిని ఇద్దరు యువరాజులుగా పేర్కొంటూ మోదీ సెటైర్లు వేశారు. ''గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఇద్దరు యువరాజులపై (రాహుల్గాంధీ, అఖిలేశ్ యాదవ్) బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు బీహార్లో సైతం ఇద్దరు యువరాజులు (రాహుల్గాంధీ, తేజస్వియాదవ్) చేతులు కలిపి సింహాసనంపై కన్నేశారు. కానీ వారికి ప్రజల చేతిలో పరాభవం తప్పదు'' అని ప్రధాని వ్యాఖ్యానించారు. అంతేకాదు,
బీహార్ ఎన్నికలపై పండితుల అంచనాలను సైతం ఓటర్లు తలకిందులు చేశారని, కరోనా పరిస్థితుల్లోనూ తొలి దశలో మెరుగైన పోలింగ్ శాతం నమోదైందని ప్రధాని మోదీ అన్నారు. ఫస్ట్ ఫేజ్ లో ఓటింగ్ సరళి నితీశ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచేలా సాగిందని, ఎన్డీఏను ఒక రాజకీయ కూటమిగా కాకుండా, వ్యక్తితో సమానంగా బీహారీలు ప్రేమను పంచుతున్నారిన ప్రధాని చెప్పారు.
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి గత నెల 28న తొలి దశ పోలింగ్ జరగ్గా, రెండో దశ పోలింగ్ ఈనెల 3న(మంగళవారం) జరగనుంది. రెండో దశ పోలింగ్ ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో ప్రధాని మోదీ ఏకంగా నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. నవంబర్ 7న మూడో దశ పోలింగ్ తో బీహార్ ఎన్నికలు ముగుస్తాయి. ఈనెల 10న ఫలితాలు వెల్లడవుతాయి.