చలిగాలులు: మండపంలోనే నవవధువు మృతి
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని భక్తియార్పూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా వీస్తున్న చలి గాలులతో ఓ నవ వధువు మృతి చెందింది. ఆమె వివాహం జరిగే రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహానికి ముందు జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నవ వధువు సోనీ కుమారి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. తీవ్రమైన చలిగాలుల వల్లే ఆమె మృతి చెందిందని చెప్పారు.
నవ వధువు మృతితో ఆమె కుటుంబసభ్యులతోపాటు వరుడు కూడా విషాదంలో మునిగిపోయాడు. పెళ్లికి వచ్చిన బంధువులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనందోత్సాహాలతో సందడిగా ఉండాల్సిన పెళ్లి మండపం విషాదంలో మునిగిపోయింది.
కాగా, వరుడు గయానానంద్ కుమార్.. సోనీ కుమారి మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్తానడడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తనకు భార్యగా కావాల్సిన కుమారిని తన ఇంటికి తీసుకెళ్లి, తానే అంత్యక్రియలు జరిపిస్తానని గయానానంద్ తెలిపాడు.