భర్తతో విభేదాలు, ప్రియుడితో వివాహనికి ట్విస్ట్: యువతి సాహసం
పాట్నా: ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొనేందుకు ఓ యువతి తన కిడ్నీనే విక్రయించాలని భావించింది. అయితే ప్రియుడిని వివాహం చేసుకొనేందుకు వరకట్నం ఇచ్చేందుకు యువతి తన కిడ్నిని విక్రయించేందుకు సిద్దమైంది.
బిహార్కు చెందిన యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. భర్తతో విభేదాల కారణంగా ఇటీవల పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో మరో యువకుడితో ప్రేమలో పడింది. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి అతడిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. అందుకు వారు అంగీకరించలేదు.
అయినా మనసు మార్చుకోని యువతి అతడితో వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రేమించిన వాడు మాత్రం కట్నం లేకుండా పెళ్లి కుదరదని తెగేసి చెప్పేశాడు. దాదాపు రూ.2 లక్షలు కట్నంగా ఇస్తేనే పెళ్లి జరుగుతుందని తేల్చి చెప్పాడు. పెళ్లికే అంగీకరించని తల్లిదండ్రులు, అంత కట్నం ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నించడంతో యువతి అయోమయంలో పడింది. చివరికి తన కిడ్నీని అమ్మడం ద్వారా ప్రియుడు అడిగిన డబ్బులు సమకూర్చుకోవాలని భావించి ఢిల్లీకి పయనమైంది.
దేశ రాజధానిలోని ఓ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తాను కిడ్నీ దానం చేయాలని అనుకుంటున్నట్టు వైద్యులకు తెలిపింది. అయితే వైద్యులు మాత్రం ఆమె కిడ్నీ అమ్మడానికే వచ్చినట్టు అనుమానించి మహిళా కమిషన్కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతి చెప్పింది విని నివ్వెరపోయారు.
ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రియుడిపై ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. అయితే కిడ్నీ అమ్మాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గిన ఆమె ప్రియుడిపై కేసు పెట్టేందుకు నిరాకరించి తిరిగి బిహార్ వెళ్లిపోయింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఈ కేసు వివరాలను బిహార్ మహిళా కమిషన్కు పంపి యువతికి సాయం అందించాల్సిందిగా కోరింది. అలాగే యువతి ప్రియుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.