సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో పిటిషన్-11 రేపిస్టుల విడుదలను సవాల్ చేస్తూ-సీజేఐ రియాక్షన్..
గుజరాత్ లో 2002లో జరిగిన మతఘర్షణల్లో తనను దారుణంగా రేప్ చేయడంతో పాటు తన కుటుంబంలోని ఏడుగురు సభ్యుల్ని పొట్టనబెట్టుకున్న 11 మంది దోషుల్ని తాజాగా బీజేపీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 15న ఈ 11 మందికి గుజరాత్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు చేసిన ఓ వ్యాఖ్య ఆధారంగా విడుదల క్షమాభిక్ష ప్రసాదించి వదిలిపెట్టేసింది. దీంతో వీరికి స్ధానిక బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. స్వీట్లు తినిపించారు. వీరి విడుదలపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వయంగా వీరి బాధితురాలైన బిల్కిస్ బానో కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇవాళ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన రేపిస్టుల్ని గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన పేరుతో ఆగస్టు 15న ఎలా విడుదల చేస్తుందని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటికే బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు బిల్కిస్ బాసో కూడా తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేయించారు. దీంతో ఈ పిటిషన్ దాఖలు చేసిన లాయర్ తో ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. బిల్కిస్ బానో పిటిషన్ సాధ్యమైనంత త్వరగా లిస్ట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపడితే తిరిగి ఆ రేపిస్టుల్ని జైలుకు పంపే అవకాశాలున్నాయి.