నరేంద్ర మోడీకి గోల్ కీపర్ అవార్డు: ఎందుకో తెలుసా?
న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గోల్ కీపర్ అవార్డు లభించింది. గోల్ కీపర్ అవార్డు ఆయనకు రావడమేంటనేగా అనుమానం? ఇది క్రీడా రంగానికి సంబంధించిన పురస్కారం కాదు. గ్రామీణ స్థాయిలో పరిసరాల పరిశుభ్రత, బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించడానికి కృషి చేసిన వారికి ఇచ్చే అంతర్జాతీయ స్థాయి అవార్డు ఇది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కొన్నేళ్లుగా ఈ అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ఈ రంగంలో కృషి చేసిన వారికి ఏటా అందజేసే పురస్కారానికి ఈ ఏడాది నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రజలకు అవగాహన కలిగేలా చేసినందుకు నరేంద్ర మోడీని ఎంపిక చేశారు ఫౌండేషన్ ప్రతినిధులు. అమెరికాలోని న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితిలో ఏర్పాటైన ఓ కార్యక్రమంలో బిల్ గేట్స్ ఈ అవార్డును నరేంద్ర మోడీకి అందజేశారు.
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు..
2014లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తానే స్వయంగా చీపురు పట్టి రోడ్లను ఊడ్చారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ కింద గ్రామీణ స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రాలకు గ్రాంటు రూపంలో నిధులను మంజూరు చేస్తోంది. ఈ నిధులకు తమ వాటా మొత్తాన్ని జోడించి, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తున్నాయి. ఈ రకంగా గ్రామాల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలనకు కృషి చేయడం, పారిశుద్ధ్యం పట్ల అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టడాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఓ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా చీపురు పట్టడం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. మోడీ కంటే ముందుగా.. నార్వే ప్రధాని ఎర్నా సోల్ బర్గ్, లైబీరియా అధ్యక్షుడు ఎల్లెన్ జాన్సన్ సిర్లీఫ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఇక ఫిట్ ఇండియా..
బిల్ గేట్స్ చేతుల మీదుగా గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును అందుకున్న అనంతరం ప్రధాని ప్రసంగించారు. ఈ అవార్డు తనది కాదని, 130 కోట్ల భారతీయులదని అన్నారు. తాను చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రజలు ఆదరించారని, అందువల్లే ఇది విజయవంతమైందని చెప్పారు. స్వచ్ఛ భారత మిషన్ ను ప్రజలు ఆదరించి, అక్కున చేర్చుకున్న నేపథ్యంలో.. తాను సరికొత్త ఆలోచనలు చేస్తున్నానని అన్నారు. తన దేశ ప్రజలు ఇక ఫిట్ ఇండియా ఉద్యమంపై దృష్టి సారించారని చెప్పారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే దేశ ప్రజలు శారీరక దారుఢ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. గ్రామీణ పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించడం వల్ల గ్రామీణ స్థాయిలో ఏటేటా వ్యాపించే కొన్నిరకాల సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. చిన్నపిల్లలు హృద్రోగం బారిన పడటం, మహిళలు ఆరోగ్య ప్రమాణాలు రెట్టింపు అయ్యయాని అన్నారు.
అయిదేళ్లలో 11 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు..
2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ను ఆరంభించిన తరువాత ఈ అయిదేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మిషన్ వల్ల లబ్ది పొందినది గ్రామీణ మహిళలేనని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలనే ప్రధాన లక్ష్యంతోనే తాము దీన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ మిషన్ లక్ష్యాలను సాధించడం, తనకు అంతర్జాతీయ స్థాయి అవార్డును సాధించి పెట్టడం ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. స్వచ్ఛ భారత్ ను ప్రారంభించడానికి కోట్లాదిమంది గ్రామీణులు అపరిశుభ్ర వాతావరణంలో నివసించే వారని, ఆ పరిస్థితులను తాము క్రమంగా నిర్మూలిస్తున్నామని నరేంద్ర మోడీ చెప్పారు. ఈ ప్రయాణంలో తాము ఇంకా గమ్యాన్ని అందుకోలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. తాను ఇంకా చాలాదూరం ప్రయాణించాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు.