వచ్చే దశాబ్దం ‘భారత్’దే: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పదేళ్ల కాలంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని ఆయన అన్నారు.
ఆర్థిక మందగమనంలో ఉండగా..
దేశంలో అమలు చేస్తున్న ‘ఆధార్' గుర్తింపు వ్యవస్థ వల్ల ఎన్నో లాభాలున్నాయని బిల్ గేట్స్ ప్రశంసించారు. ఇంకా ఆర్థిక సేవలు, ఫార్మా రంగాల్లో కనబరుస్తున్న సామర్థ్యం ప్రశంసనీయమైన ఆయన అన్నారు. దేశంలో ఆర్థిక మందగమనం మరికొన్నేళ్లు సాగుతుందనే భయాల నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన సానుకూల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అనూహ్య వృద్ధిరేటు..
స్వల్ప కాలంలో ఏం జరుగుతుందనేది తెలియదని.. అయితే, రానున్న దశాబ్ద కాలంలోనే భారత్ అనూహ్య వృద్ధిరేటు నమోదవుతుందని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, విద్య అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆ సత్తా వుంది..
భారత ఐటీ వ్యవస్థలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. భారత్కు వేగంగా అభివృద్ధి రేటు నమోదు చేయగల సత్తా ఉందని బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. ఆర్థిక సేవలు లేదా డిజిటల్ గుర్తింపు కోసం నందన్ నీలేకని లాంటి వాళ్లను తాము భాగస్వాములను చేసుకుంటామని అన్నారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు భారతదేశంలో అద్భుతమైన వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారని ఆయ తెలిపారు.
మళ్లీ ప్రపంచ కుబేరుడిగా..
బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆయన మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. కాగా, 110 బిలియన్ డాలర్ల సంంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ను వెనక్కునెట్టి 64ఏళ్ల బిల్ గేట్స్ మరోసారి ప్రపంచ అత్యంత సంపన్నుడిగా అవతరించాడు.