10% రిజర్వేషన్ బిల్లుకు లోకసభ ఆమోదం, పార్టీలకు ప్రధాని మోడీ థ్యాంక్స్
Recommended Video
న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును లోకసభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం విపక్షాలు అభ్యంతరాలు చెప్పాయి. చివరకు దానికి ఓకే చెప్పాయి. న్యాయ సమీక్షలో ఇది నిలబడటం కష్టమని చెప్పారు. రాత్రి పది గంటల సమయంలో ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 323 మంది, వ్యతిరేకంగా నలుగురు ఓట్లు వేశారు.
బిల్లు పాస్ అయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. పేదలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం లభించడం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, ప్రతి నిరుపేదా అన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరించే సమర్థ ప్రక్రియకు బిల్లు ఆమోదం శ్రీకారం చుట్టిందన్నారు.
కుల, మతాలతో నిమిత్తం లేకుండా ప్రతి పేదవ్యక్తి హుందాగా జీవించేలా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు. అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలని, ఈ బిల్లును సమర్థించిన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆందరితో కలిసి అభివృద్ధి అనే నినాదానికి కట్టుబడి ఉన్నామన్నారు.
అంతకుముందు, మంగళవారం మధ్యాహ్నం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా మంగళవారం మరో అడుగు ముందుకు వేసింది. ఇందుకు సంబంధించి లోకసభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో 2/3 వంతు మెజార్టీ అవసరం. లోకసభలో ఆమోదం పొందిన తర్వాత దీనిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. దీనిపై లోకసభలో చర్చ జరగనుంది. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
జనరల్ విభాగంలో ఆర్థికంగా వెనకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసింది. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు. 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్పుట్లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందుతాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. దీంతో రిజర్వేషన్లు 59.5% అవుతాయి.
పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా సగం రాష్ట్రాలు ఆమోదించాలి. 29 రాష్ట్రాలకు గాను బీజేపీ లేదా బీజేపీ మిత్రపక్షాలు దాదాపు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాల్లో ఆమోదానికి అడ్డంకులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. లోకసభలోను పెద్దగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నారు. ఎందుకంటే పలు పార్టీలు రాజకీయం అంటూనే మద్దతు పలుకుతున్నాయి.