వృద్ధులపై వేధింపులకు 6 నెలల జైలు: లోక్సభలో సీనియర్ సిటిజన్ బిల్లు
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్ల(వృద్ధులు)కు రక్షణ కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. తమ తల్లిదండ్రులను ఉద్దేశపూర్వకంగా దూషించిన పిల్లలకు కూడా ఈ బిల్లు శిక్ష పడుతుంది.
ఈ బిల్లు ప్రకారం.. సీనియర్ సిటిజన్లపై దూషణలకు పాల్పడినా.. మానసికంగా, శారీరకంగా వేధింపులకు దిగిన వారికి ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. లేదంటే రూ. 10వేల జరిమానా విధించడం జరుగుతుంది. లేదంటే ఈ రెండు శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది.
తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ, సీనియర్ సిటిజన్స్(సవరణ) బిల్లు 2019ను సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ మంత్రి థావర్చంద్ గెహ్లట్ సభలో ప్రవేశపెట్టారు. వృద్ధాశ్రమాల నిర్వాహకులు తమ సంస్థలను రిజిస్టర్ చేయించుకోవాలని, అవన్ని ప్రభుత్వం ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు. చర్చ అనంతరం ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు తీపి కబురును అందించింది. నెలనెలా పొందే పింఛను అందుకునేందుకు ఏటా వారు నెల రోజుల గడువులోగా జీవన్ ప్రమాణ్ పత్రం దాఖలు చేయాల్సి ఉండగా, ఈ గడువును రెండు నెలలకు పెంచింది. ఈ మేరకు ప్రజా నివేదనలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 80 లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న సీనియర్ సిటిజన్ల నవంబర్ 1 నుంచి 30 లోపు తాము పింఛను పొందే చోట లేదా బ్యాంకులో జీవన్ ప్రమాణ్ పత్రం దాఖలు చేయాల్సి ఉంది. దీన్ని అక్టోబర్ 31కి కుదించారు. అంటే అక్టోబరులో పత్రం దాఖలు చేస్తే మరుసటి ఏడాది నవంబర్ వరకూ అది చెల్లుబాటు అవుతుంది.