పద్మభూషణ్: ధన్యవాదాలు తెలిపిన బిల్ గేట్స్ దంపతులు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తమకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల బిల్ గేట్స్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో భారత్ వృద్ధి దిశగా కొనసాగాలని తాము కొరుకుంటున్నామన్నారు.
"సమాజ సేవకుగానూ పలువురు ప్రముఖ వ్యక్తులతో పాటు పద్మ అవార్డు తీసుకోబోతుండటం చాలా గర్వంగా భావిస్తున్నాం. ఇంతటి దేశ అత్యున్నత పురస్కారానికి తమ పేరును ఎంపిక చేసిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాం" అని ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో సమాజ సేవకు గాను బిల్ గేట్స్ దంపతులకు పద్మభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్లో హెచ్ఐవి/ఎయిడ్స్ను నివారించేందుకు గాను 2003 నుంచి బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ పేరుతో సమాజ సేవ చేస్తున్నారు. దీని నుంచి టీకాలు, ప్రసూతి మరియు పిల్లల ఆరోగ్యం, పారిశుధ్యం, వ్యవసాయ అభివృద్ధికి పనిని విస్తరించారు. న్యూఢిల్లీలో వీరికి ఒక ఆఫీసు కూడా ఉంది.