ఎంఎల్ సీ భర్త: గతంలో సైకిళ్ల దొంగ
పాట్నా: బీహార్ ఎంఎల్ సీ మనోరమా దేవి కుమారుడు రాకీ యాదవ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతున్నది. తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో ఇంటర్ విద్యార్థి ఆదిత్య సచ్ దేవ్ (20) అనే యువకుడిని నడి రోడ్డు మీద తుపాకితో దారుణంగా కాల్చి చంపాడు.
ఈ కేసులో రాకీ యాదవ్ అరెస్టు అయ్యాడు, రాకీ యాదవ్ తండ్రి బిందేశ్వరీ ప్రసాద్ యాదవ్అలియాస్ బిందీ యాదవ్ ప్రస్తుతం వేరే కేసులో జైలులో ఉన్నాడు. ఇప్పుడు కోటీశ్వరుడు అయిన బిందీ యాదవ్ కు గతంలో నేర చరిత్ర ఉంది. గల్లి దొంగ స్థాయి నుంచి అతడు నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.
ఇప్పుడు కోట్ల రుపాయాలు అంటే లెక్కలేని బిందీ యాదవ్ గత 35 సంవత్సరాల క్రితం సైకిళ్ల దొంగ. సైకిళ్లు దొంగలించి వాటిని విక్రయించి డబ్బులు సంపాధించేవాడని గయ ప్రజలు అంటున్నారు. అయితే కోటీశ్వరుడు కావాలన్నే కోరిక అతనికి ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
1990లో బచ్చూ అనే మరో నేరస్తుడితో బిందీ యాదవ్ చేతులు కలిపాడు. నేర సామ్రాజ్యంలో బిందీ యాదవ్, బచ్చూ జోడీ బాగా పేరు సంసాదించారు. గయ పట్టణంలో అనేక మంది అమాయకుల ఆస్తులను కబ్జా చేశారు. వీరిద్దరి తుపాకులు ఎప్పుడూ మోగుతూనే ఉండేవి.
లాలు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీహార్ లో నేరాలు విచ్చలవిడిగా సాగేవి. సురేంద్ర యాదవ్, రాజేంద్ర యాదవ్, మహేశ్వర యాదవ్ అనే కరుడుగట్టిన నేరగాళ్లు వారి ప్రతాపం చూపించేవారు. ఇదే సమయంలో బిందీ యాదవ్, బిచ్చూ వారితో చేరిపోయారు.
తరువాత పోలీసులు బిందీ యాదవ్, బిచ్చూల మీద గట్టి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. తనకు రాజకీయ అండ అవసరం అని బిందీ యాదవ్ గుర్తించాడు. తరువాత అతను ఆర్జేడీ లో చేరాడు. దొంగ కాస్త దొర అయ్యాడు. 2001లో గయ జిల్లా పరిషత్ చైర్మెన్ అయ్యాడు.
2005లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. 2010లో మళ్లీ ఆర్జేడీ టిక్కెట్ మీద పోటీ చేసి ఓడిపోయాడు. అప్పటికే అతని మీద 18 క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. 2010లో నితీష్ కుమార్ అధికారంలోకి రాగానే బిందీ యాదవ్ పార్టీ మార్చి జేడీయూలో చేరాడు.
2011లో ఏకే-47, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ కలిగి ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఆ తరువాత రూటు మార్చి ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని కోట్ల రుపాయలు సంపాధించాడు. ఇప్పుడు బిందీ యాదవ్ కు అనేక మాల్స్, స్టార్ హోటల్స్, 15కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి.
రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులు, మద్యం వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. బిందీ యాదవ్ కుమారుడు రాకీ యాదవ్ వాడుతున్న ఎస్ యూవీ కారు విలువ అక్షరాల రూ. 1.50 కోట్లు. భార్యను ఎంఎల్ సీ చేసినా పెత్తనం అంతా బిందీ యాదవ్ చేతిలోనే ఉంది. ఒక నాడు సైకిళ్ల దొంగ నేడు రూ. కోట్లకు అధిపతి అని స్థానికులు అంటున్నారు.