బయో టెర్రరిజం: ఎదుర్కొనే సామర్థ్యం భారత్కు ఉందా?
మైసూర్: మైసూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీన్ కృష్ణమూర్తి ఇటీవలే ఆసక్తికరమైన విషయం చెప్పారు. భారత్ బయో టెర్రరిజం (జీవ తీవ్రవాదం)ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని హెచ్చరించారు. అంతేకాదు, వైద్యులు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్కు అత్యవసరంగా జీవ తీవ్రవాదం విషయమై శిక్షణ ఇవ్వాలన్నారు.
ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించే వ్యాధులను వ్యాప్తి చేసేందుకు తీవ్రవాదులు బయోలాజికల్ ఏజెంట్స్ను నియమించుకుంటున్నారని చెబుతున్నారు.
భారత్కు బయో టెర్రరిజం భయం?
భారత దేశానికి జీవ తీవ్రవాదం భయం ఉందని భారత దేశ, అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. వికీలీక్స్ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంట్లోను ఈ విషయంపై హెచ్చరించింది. హెచ్1ఎన్1, సార్స్, హంటా వైరస్ వంటి వాటిని విధ్వంసం సృష్టించేందుకు ఉపయోగించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
2006 నుండి జీవ తీవ్రవాదం లిస్ట్లో భారత్
లష్కరే తోయిబాతో సహా ప్రతి తీవ్రవాద గ్రూప్ భారత్ పైన బయో టెర్రరిజం దాడికి పాల్పడే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు. అయితే, ఇందుకు వారు ప్రణాళికతో వెళ్లవచ్చునని అంటున్నారు.
తమకు అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉండి ఉంటారని అంటున్నారు. బయో టెర్రరిజంతో పాటు న్యూక్లియర్ టెర్రరిజం కూడా ఉపయోగించవచ్చునని హెచ్చరిస్తున్నారు. బయో టెర్రరిజం లిస్ట్లో భారత్ 2006 నుండి ఉందని అంటున్నారు.
లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు బయో టెర్రరిజం పైన తీవ్రంగా చర్చిస్తున్నాయని అంటున్నారు. వారు ప్రపంచంలోని పలువురు శాస్త్రవేత్తలతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. శాస్త్రవేత్తల సహకారంతో బయో టెర్రరిజం దాడులకు పాల్పడవచ్చునని అంటున్నారు.
1996లో బయో టెర్రర్ అటాక్ దాడి జరిగిందా?
1996లో భారత దేశంలో డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి చెందింది. ఎంతో శ్రమకోర్చి దానిని కంట్రోల్లోకి తెచ్చారు. అయితే, ఇది భారత దేశంలో ఎలా వ్యాప్తి చెందిందనే విషయం ఇప్పటి వరకు అంతుబట్టలేదు. ఆ తర్వాత దీనిని అందరు మర్చిపోయారు!
బయో డిఫెన్స్ కార్యక్రమాలు
సమాచారం మేరకు.. నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బయో వెపన్స్ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు నాలుగు వందల మంది శిక్షణ తీసుకున్న వారు బయో టెర్రరిజంకు సంబంధించిన విధులు నిర్వర్తించవచ్చునని తెలుస్తోంది. దీనిపై సంబంధిత సంస్థలు పని చేస్తున్నాయి.