ప్రయోగం సక్సెస్ : బయో ఇంధనంతో గాల్లోకి ఎగిరిన విమానం
Recommended Video
న్యూఢిల్లీ: భారత్లో తొలి బయో ఫ్యూయెల్ విమానం గాల్లోకి ఎగిరింది. ఇది కేవలం ప్రయోగాత్మకమే అని ఇది విజయవంతం అయినట్లు అధికారులు తెలిపారు. ఇది అమల్లోకి వస్తే అత్యంత ఖరీదైన టర్బైన్ ఫ్యూయెల్ వాడకం తగ్గుతుంది. తొలిసారిగా ఈ జీవ ఇంధనంను ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ స్పైస్ జెట్ విమానం ప్రారంభించింది. ఇది డెహ్రాడూన్లో టేకాఫ్ అయి ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.
ఈ విమానానికి వినియోగించిన బయో ఫ్యూయెల్ పునరుత్పాదక వనరుల నుంచి తయారు చేసినట్లు స్పైస్ జెట్ తెలిపింది. ఇందులో వ్యవసాయ,నాన్ ఎడిబుల్ ఆయిల్స్, పారిశ్రామిక, మున్సిపల్ వాడలనుంచి వ్యర్థాలతో ఈ ఇంధనాన్ని తయారు చేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ ఇంధనంతో నడిచే విమానాల మెయింటెనెన్స్ తక్కువ ఖర్చుతో కూడుకుని ఉంటుందని స్పైస్ జెట్ వివరించింది. సోమవారం నిర్వహించిన ట్రయల్ రన్కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థ ఈ బయో ఫ్యూయెల్ను తయారు చేసింది.
డెహ్రడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి ఈ బయోఫ్యూయెల్ విమానాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రారంభించారు. మొత్తం 20 మంది ప్రయాణికులతో ఈ విమానం గాల్లోకి ఎగిరింది. 25 నిమిషాల్లో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు స్పైస్ జెట్ సంస్థ వెల్లడించింది. ఈ విమానం ఎయిర్పోర్టులో ల్యాండ్ అవగానే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, హర్ష వర్ధన్ జయంత్ సిన్హాలు రిసీవ్ చేసుకున్నారు. ఈ బయోఫ్యూయెల్ ఉత్పత్తి చేసేందుకు దాదాపు 500 వ్యవసాయ కుటుంబాలు పనిచేశాయి. విమానం కుడి ఇంజిన్లో 25శాతం బయోఫ్యూయెల్, ఎడమ ఇంజిన్లో టర్బైన్ ఇంధనంతో నింపారు. ఈ ప్రయోగం విజయవంతమైందని దీన్ని అమల్లోకి తీసుకొస్తే విమానాలకు బయోఫ్యూయెల్ వినియోగిస్తున్న దేశాలు అమెరికా, ఆస్ట్రేలియాల సరసన భారత్ నిలుస్తుంది.