అటు 'మోడీ', ఇటు 'రాహుల్'.. ఎన్నికల వేళ "బయోపిక్" సందడి
లోక్సభ ఎన్నికల సమరం మొదలైంది. పోలింగ్ కు మరో మూడు నెలల సమయమున్నా.. నేతల మాటల తూటాలతో ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార సభలతో మరింత హీటెక్కిస్తున్నారు. ఆ క్రమంలో నేతల బయోపిక్లు తెగ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలొచ్చాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బయోపిక్ల చిత్రీకరణ జరుగుతోంది.
ప్రజలు ఆదరించేనా?.. ఫలితం దక్కేనా?
ఇటీవల మోడీ బయోపిక్ సినిమాకు సంబంధించి అహ్మదాబాద్ లోషూటింగ్ ప్రారంభమైంది. పలు దశల్లో గుజరాత్ లోని ఇతర ప్రాంతాల్లోనూ చిత్రీకరించనున్నారు.
ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడు నటుడు వివేక్ ఒబేరాయ్ మోడీ పాత్రను పోషిస్తున్నారు. బొమన్ ఇరానీ, దర్శన్ కుమార్ తదితర నటులతో "పీఎం నరేంద్రమోడీ" టైటిల్ తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. సందీప్ సింగ్, సుషేర్ ఒబేరాయ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.
లోక్ సభ ఎన్నికల టార్గెట్ గా వస్తున్నాయి మోడీ, రాహుల్ బయోపిక్ సినిమాలు. ఈ రెండు చిత్రాలు కూడా ఎన్నికలకు ముందు రిలీజ్ చేయాలనేది ప్లాన్. 2014 ఎన్నికల్లో పూర్తిగా సోషల్ మీడియాపై ఆధారపడ్డ మోడీ.. ఈసారి వినూత్నంగా సినిమాలను ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఎన్నికల ముందు వస్తున్న మోడీ, రాహుల్ చిత్రాలను పబ్లిక్ ఏవిధంగా ఆదరిస్తారో చూడాలి.
సినిమాలతో ఓట్ల గాలం
'మై నేమ్ ఈజ్ రాగా' అనే టైటిల్తో రాహుల్ గాంధీ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. అందులో ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో కోణాలను చూపించనున్నారు. ఇందిరాగాంధీ హత్య మొదలు ప్రస్తుత ఎన్నికల వరకు వివిధ సన్నివేశాలు ఉండనున్నాయి. సెయింట్ డ్రాకులా, కామసూత్ర లాంటి సినిమాలు తీసిన దర్శకుడు పాల్ రూపేష్.. రాహుల్ బయోపిక్ బాధ్యతలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. రాహుల్ గాంధీ పొలిటికల్ ఎంట్రీ ఏవిధంగా జరిగిందనే విషయం ఈ సినిమాలో కళ్లకు కట్టనున్నారు. ఇది కేవలం బయోపిక్ మాత్రమే కాదని.. రాహుల్ పై జరుగుతున్న దాడుల నుంచి ఆయన ఎలా బయటపడుతున్నారనే వృత్తాంతంతో చిత్రికరించే సినిమా అంటున్నారు దర్శకుడు పాల్ రూపేష్.
రాహుల్ గాంధీ కథాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంకగాంధీ ఎంట్రీని చివరి సీన్ గా షూట్ చేస్తామంటున్నారు దర్శకుడు. ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ తో పాటు యూఎస్ లోని కొల్లిన్ కాలేజీలో కొంతమేర షూటింగ్ జరుపుతామంటున్నారు. అలాగే ఇటలీలోని రాహుల్ గాంధీ తాత ఇంట్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తామని తెలిపారు. తక్కువ షెడ్యూల్స్ తో ఈ సినిమా అతి త్వరలో పూర్తిచేస్తామంటున్నారు.
బయోపిక్ సీజన్.. ఎన్నికల వేడి
దేశమంతటా బయోపిక్ల సీజన్ ఊపందుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్సార్ జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్లు రూపొందాయి. కథానాయకుడిగా ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి వెళ్లిపోయింది. తాజాగా యాత్ర పేరిట వచ్చిన వైఎస్సార్ బయోపిక్ చిత్రం థియేటర్లలో ఆడుతోంది. అటు తమిళనాట ఎంజీఆర్, జయలలిత బయోపిక్లు తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఇక మోడీ జీవిత నేపథ్యంలో బయోపిక్ తెరకెక్కుతోంది. దానికి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. అదలావుంటే రాహుల్ గాంధీ లైఫ్ అండ్ పొలిటికల్ కెరీర్ కు సంబంధించిన బయోపిక్ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.