ఒకే ఒక్కడు.. ఫైర్మాన్ బిపిన్ గణత్ర: 40ఏళ్లుగా అలుపెరగని ప్రయాణం..
19ఏళ్ల వయసు నుంచే అగ్నిప్రమాదాల్లో సేవలందించడం అలవాటుగా మార్చుకున్నారు.
అతనేమి ఫైర్, సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సులు చదవలేదు. కానీ ఫైర్ యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు సేఫ్టీ ఇంజనీర్స్ కన్నా మిన్నగా వ్యవహరిస్తుంటాడు.
అలా అని అతనేమి అగ్నిమాపక శాఖలో ఉద్యోగి కూడా కాదు. పోనీ.. అలా చేయడం వల్ల అతనికేమి డబ్బులు వచ్చింది లేదు. మరెందుకు ఎక్కడ అగ్నిప్రమాదం జరిగితే.. అక్కడ అతను ప్రత్యక్షమైపోతాడు?.. దీనికి ప్రత్యేకమైన కారణమేమి లేదు. బిపిన్ గణత్ర అలా కనెక్ట్ అయిపోయాడంతే.
అది మొదలు:
1976లో కోల్కతాలోని సిటీ స్కూల్లో అతను మెకానిక్గా పనిచేస్తుండగా ఆ స్కూల్లో సంభవించిన అగ్నిప్రమాదం అతని జీవితాన్నే మార్చేసింది.
ఆ సమయంలో ఫైరింజన్ రాకముందే మంటలను అదుపు చేయడలంలో బిపిన్ సఫలమయ్యాడు. ఇక అది మొదలు.. 19ఏళ్ల వయసు నుంచి గడిచిన 40ఏళ్లుగా బిపిన్ ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా స్వచ్చందంగా అక్కడ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు. ఈ విరామమెరుగని ఫైర్ వీరునికి కోల్కతా ప్రజలు 'ఫైర్మాన్'గా పిలుచుకుంటుంటారు.
చిన్నా చితకా పనులతో:
ఇప్పటివరకు కోల్కతాలో సంభవించిన సుమారు వంద అగ్నిప్రమాదాలలో తన సహాయ సహకారాలను స్వచ్ఛందంగా అందించాడు. 59 ఏళ్ల వయస్సున్న బిపిన్ తన 19 ఏటనుంచే సహాయక చర్యలు అందించడంలో నిమగ్నమై ఉన్నాడు.
పెద్దగా చదువుకోని బిపిన్.. చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా అగ్రిప్రమాదం సంభవించిందని తెలిస్తే.. చేస్తున్న పనిని కూడా వదిలేసి అక్కడ వాలిపోతాడు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేదాకా విశ్రమించకుండా తనవంతు సహాయ సహకారాలు అందిస్తాడు.
హౌరా బ్రిడ్జిపై ప్రమాదంలోను:
1990లో కోల్కతాలో హౌరా బ్రిడ్జిపై సంభవించిన అగ్ని ప్రమాదంలోను, మరోసారి కానింగ్ స్ట్రీట్లో సంభవించిన అగ్ని ప్రమాదంలోను బిపిన్ చూపించిన చొరవ మరవలేనిది. ఆ సమయంలో ఎంతోమంది బాధితులను ఆయన రక్షించగలిగాడు. అలా బిపిన్ ఇప్పటి వరకు 100కు పైగా అగ్ని ప్రమాదాల్లో ఎంతో మందిని రక్షించాడు. అందరి చేత ప్రశంసలు పొందాడు.
బిపిన్ సేవలను గుర్తించిన అతనికి ఫైర్ డిపార్ట్మెంట్ వారు ఓ వాలంటరీ ఐడీ కార్డు కూడా ఇచ్చారు. ఫైర్ యూనిఫాం, షూస్, హెల్మెట్ వంటి వాటిని స్నేహితుల సహాయంతో కొనుక్కున్నాడు. వాటిని ధరించి అతను ఇప్పటికీ అగ్ని ప్రమాదాల దగ్గరకు వెళ్తాడు.
నిస్వార్థ జీవి:
వయసు మీద పడ్డా.. అతను అగ్ని ప్రమాదాలు సంభవించిన చోటుకు వెళ్లడం మాత్రం మానుకోలేదు. ఒకసారి తానే స్వయంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితి తెచ్చుకున్నాడు. 2 గం. తర్వాత సురక్షితంగా మళ్లీ తనకు తానే బయట పడ్డాడు.
పైసా ఆశించకుండా ప్రజల కోసం తన ప్రాణాలను రిస్క్ లో పెడుతున్న బిపిన్ కృషిని భారత ప్రభుత్వం గుర్తించింది. ఈ ఏడాది పద్మశ్రీ సత్కారాన్ని ఆయనకు అందజేసింది. ప్రధాని మోడీ చేతుల మీదుగా బిపిన్ ఆ సత్కారాన్ని అందుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ లో సేవలు అందించే సత్తా తనలో ఇంకా ఉందని, అలసిపోయేవరకు ఈ ప్రయాణం ఆగిపోదని బిపిన్ చెబుతుంటాడు. ఇంత నిస్వార్థంగా సేవలందిస్తున్న ఈ మనిషికి 'సలాం' చెప్పకుండా ఎలా ఉండగలం.