భయపెడుతున్న బర్డ్ ఫ్లూ..హిమాచల్లో 1800 పక్షులు మృత్యువాత,కేరళలో 36వేల పక్షులను చంపేయనున్న అధికారులు
దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాజస్తాన్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బయటపడ్డ ఈ వైరస్ తాజాగా కేరళ,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ వెలుగుచూసింది. దీంతో మున్ముందు ఇతర రాష్ట్రాలకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుందా అన్న ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాప్తిని గుర్తించిన రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైరస్ బయటపడ్డ ప్రాంతాల్లోని పక్షులను చంపేస్తున్నాయి. ఈ వైరస్ పక్షుల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Recommended Video
హిమాచల్లో 1800 పక్షులు మృత్యువాత...
తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో ఉన్న పాంగ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 1800 వలస పక్షులు మృత్యువాతపడినట్లు అక్కడి అధికారులు గుర్తించారు. వీటి నమూనాలను ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు పంపించగా వాటిల్లో వైరస్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హిమాచల్ ప్రభుత్వం పాంగ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో టూరిస్ట్ కార్యకలాపాలను రద్దు చేసింది. కంగ్రా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పౌల్ట్రీ(చికెన్,బాతు,పక్షుల మాంసం),గుడ్ల విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించింది.
కేరళలో 36వేల పక్షులను చంపేయనున్న అధికారులు
కేరళలోని కొట్టాయం,అలప్పుజా జిల్లాల్లోనూ బర్డ్ ఫ్లూ వైరస్ బయటపడింది. ఈ రెండు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 12వేల పక్షులు మృత్యువాత పడ్డాయి. దీంతో పక్షులు మృత్యువాత పడిన ప్రాంతానికి కి.మీ పరిధిలో ఉన్న మిగతా పక్షులన్నింటినీ చంపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అక్కడి అధికారులు దాదాపు 36వేల పక్షులను చంపబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారణంగా నష్టపోయే రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి ఒకరు చెప్పారు.
H5N1 ఇన్ఫ్లుయెంజా...
H5N1 అనే ఇన్ఫ్లుయెంజా వైరస్ కారణంగా మధ్యప్రదేశ్,రాజస్తాన్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పక్షులు బర్డ్ ఫ్లూ బారినపడుతున్నాయి. ఈ వైరస్ సోకిన పక్షుల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది మనుషులకు కూడా సోకే అవకాశం ఉండటంతో వైరస్ బయటపడ్డ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కేరళలో 2016లోనూ విపరీతమైన బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. తాజాగా ఆ రాష్ట్రంలో బయటపడ్డ బర్డ్ ఫ్లూ వైరస్ను H5N8గా గుర్తించారు.
మధ్యప్రదేశ్,రాజస్తాన్లలో...
గతవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దాదాపు 50 కాకులు మృత్యువాత పడగా వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలింది. ఇటీవల రాజస్తాన్లోని చాలా జిల్లాల్లో కాకులు మృత్యువాత పడ్డాయి. వీటి నమూనాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఆదివారం(జనవరి 3) రాజస్తాన్లోని బికనీర్లో 80,సవాయ్ మధోపూర్లో 42,బరన్లో 12,కోటాలో 12,పాలి,జైపూర్,దౌసాలో 8 పక్షులు మృత్యువాత పడ్డాయి. సోమవారం(జనవరి జనవరి 4) మరో 170 పక్షులు మృత్యువాత పడ్డాయి. పక్షులు మృతి చెందిన ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.