దేశ రాజధానిలో బర్డ్ ఫ్లూ కలకలం: 50కిపైగా కాకులు మృతి, భయాందోళనల్లో ప్రజలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజుల్లోనూ 50కిపైగా కాకులు మృత్యువాత పడటం గమనార్హం. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కాకుల నుంచే బర్డ్ ఫ్లూ..
హెచ్5ఎన్1 వైరస్ వ్యాప్తి కారణంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతోందని అధికారులు కనుగొన్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో పక్షి నుంచి పక్షికి బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందని గుర్తించారు. నమూనాలను సేకరించేందుకు వైద్యుల బృందం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తోంది. నమూనాలను ల్యాబ్లకు పంపించారు. కేరళలో వ్యాధి బయటపడిన రెండు జిల్లాల్లో పక్షులను వధించే ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం క్రిమి సంహారక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. హర్యానాలో రెండు కోళ్ల ఫాంలలో దీన్ని గుర్తించగా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాకుల్లో ఎక్కువగా ఈ వ్యాధి బయటపడినట్లు తెలిపింది.
రాష్ట్రాలు కేంద్ర బృందాలు
ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ సోకని రాష్ట్రాల్లోనూ పక్షుల అనుమానాస్పద మరణాలను గుర్తిస్తే,. వెంటనే తెలియజేయాలని సూచించింది. దీంతో సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాధి కట్టడి చేయవచ్చని కేంద్రం తెలిపింది. బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను కేంద్రం పంపించింది. బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అటు పౌల్ట్రీ యజమానులు, ప్రజల్లో ఆందోళనలను తొలగించేందుకు ఆయా రాష్ట్రాలు అవగాహన కార్యక్రమలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఆందోళనల్లో ప్రజలు..
బర్డ్ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాలైన కేరళ, హర్యానా, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలు కేంద్రం పంపించింది. బర్డ్ ఫ్లూ వ్యాధి నేపథ్యంలో అటు పౌల్టీ యజమానులు, ప్రజల్లో ఆందోళనలను తొలగించేందుకు ఆయా రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో సుమారు 500కుపైగా కాకులు చనిపోవడం గమనార్హం.