మహారాష్ట్రలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం...పౌల్ట్రీ ఫామ్ లు,చికెన్ దుకాణాలు మూసివేత నిర్ణయం
ఒకపక్క కరోనా మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తుంటే మరోపక్క మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్లోని పౌల్ట్రీ ఫామ్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నిర్ధారించబడిందని పాల్ఘర్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్ మహాజన్ తెలియజేశారు.
మహారాష్ట్రలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ తో 45 కోళ్లు మరణించాయి.దీంతో అప్రమత్తమైన మహా ప్రభుత్వం అధికారులను తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో వచ్చే 21 రోజుల పాటు అన్ని పౌల్ట్రీ ఫామ్లు, చికెన్ విక్రయించే దుకాణాలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.
బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి పక్షుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధి కావడంతో బర్డ్ ఫ్లూ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
గత మూడు రోజులుగా వరుసగా, చనిపోతున్న కోళ్ల నుండి నమూనాలు సేకరించి, నమూనాలను పరీక్ష కోసం పూణేకు చెందిన ల్యాబ్ కు పంపారు .అక్కడ ల్యాబ్ లో ఆ సాంపిల్స్ బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ అయ్యాయి.దీంతో అధికారులను మహా సర్కార్ అలెర్ట్ చేసింది. అందులో భాగంగా చికెన్ విక్రయాలను నిలిపివేశారు.