బిర్యానీ ఆఫర్ చాలా మంచి ‘పని’ చేసింది
తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్ పరిసర ప్రాంతాల్లో పచ్చటి వాతరణం ఉంది. కోజికోడ్ కు 25 కిలో మీటర్ల దూరంలోని ఓ గ్రామంలో చిరా అనే చెరువు ఉంది. 14 ఎకరాల్లో ఉన్న ఈ సరస్సులో చెత్తా చెదారం నిండిపోయింది.
దుర్వాసన వస్తున్నది. స్థానికులు ముక్కులు మూసుకుని వెళ్లడం తప్పా ఏమి చెయ్యలేకపోయారు. రాష్ట్రంలోని చెరువుల్లో వ్యర్థాలను తోలగించాలని కేరళ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయినా చిరా సరస్సు పరిస్థితి అలాగే ఉంది.
ఈ సరస్సును ఎలాగైనా శుభ్రం చేయించాలని జిల్లా కలెక్టర్ ఎన్. ప్రశాంత్ భూషణ్ కు ఆలోచన వచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా సరస్సు శుభ్రం చెయ్యడానికి వచ్చే స్థానికులకు బిర్యానీతో పాటు రుచికరమైన వంటకాలు పెడుతామని సోషల్ మీడియాలో పెట్టారు.
దీనికి భారీగానే స్పందన వచ్చింది. సుమారు 500 మంది వెళ్లారు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా మహిళలు, పిల్లలు, చిన్నా, పెద్దా, అధికారి, ఉద్యోగి అని తేడా లేకుండా అందరూ సరస్సులోకి దిగి చెత్తా చెదారం తీయ్యడానికి ప్రయత్నించారు.
జిల్లా కలెక్టర్ సైతం సరస్సులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు అందరితో కలిసి పని చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ భూషణ్ బయటకు వచ్చి వంటలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. ఆయనే స్వయంగా గరిట పట్టి వంటలు చేశారు.
తరువాత బిర్యానీతో పాటు వంటలను స్వయంగా కలెక్టర్ ప్రశాంత్ భూషణ్ స్థానికులకు వడ్డించారు. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇంతకాలం దుర్వాసనతో ఉన్న చిరా సరస్సు ఇప్పుడు చూడటానికి చాల అందంగా ఉందని స్థానికులు అంటున్నారు.