‘ఉగ్రవాదులకు బిర్యానీ’: సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఆదిత్యనాథ్కు ఎన్నికల సంఘం(ఈసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఉగ్రవాదులకు బిర్యానీ అందిస్తున్నారంటూ యోగి ఆదిథ్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈ నోటీసులు పంపింది.
శుక్రవారం(ఫిబ్రవరి 7) సాయంత్రం 5గంటలలోగా దీనిపై సమాధానం ఇవ్వాలని సూచించింది. ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియామావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.
ఫిబ్రవరి 1న జరిగిన ప్రచారం సభలో యోగి మాట్లాడుతూ.. షాహిన్బాగ్ ఆందోళనలకు ఆమ్ ఆద్మీ పార్టీ సహకరిస్తోందని ఆరోపించారు. ఉగ్రవాదులకు బిర్యానీలు అందజేస్తున్నారంటూ విమర్శించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచార గడువు గురువారం సాయంత్రం ఐదు గుంటలతో ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసింద.ి అయితే, ముఖ్యంగా ఆప్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. తిరిగి అధికారం నిలబెట్టుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. బీజేపీ కూడా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ పలువురు కేంద్రమంత్రులు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం తమదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కాగా, శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించింది ఎన్నికల సంఘం.