జైట్లీ ప్రటకన ఎఫెక్ట్: భారీగా పడిపోయిన బిట్కాయిన్ విలువ
న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన బిట్ కాయిన్ తీవ్ర ప్రభావం చూపింది. భారత్లో బిట్కాయిన్ సహా ఏ క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదని.. వాటిని ఎవరూ వినియోగించకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని అరుణ్ జైట్లీ హెచ్చరించిన విషయం తెలిసిందే.
కాగా, ఆ మరుసటి రోజే భారత్లో బిట్కాయిన్ విలువ భారీగా పడిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం 1.05గంటకు బిట్కాయిన్ విలువ రూ.5,44,735 వద్ద ట్రేడవుతోంది. బిట్కాయిన్ విలువ 15శాతం పడిపోయి రెండు నెలల కనిష్ఠానికి చేరినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గతంలో దీని విలువ రూ.6,44,042 ఉంది.
బిట్సాచ్ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్ వ్యవస్థాపకుడు ఆశిష్ అగర్వాల్ దీనిపై స్పందించారు. బిట్కాయిన్ చట్టబద్ధం కాదని జైట్లీ చెప్పడం వల్ల పెట్టుబడిదారుల్లో భయం నెలకొందని ఆయన తెలిపారు.
గురువారం బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ మాట్లాడుతూ.. భారత్లో వూహాజనిత కరెన్సీలను నిర్వహించేందుకు ఆర్బీఐ ఎలాంటి లైసెన్సులు ఇవ్వలేదని తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలో బిట్కాయిన్ ట్రేడింగ్ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ బిట్ కాయిన్ ట్రేడింగ్ జోరుగా సాగుతుండటం గమనార్హం.
వారికి నోటీసులు
వూహాజనిత కరెన్సీ అయిన బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టి పన్నులు చెల్లించని లక్షలాది మందికి నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ తెలిపింది. బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొంది ముందస్తు పన్నులు చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు సీబీడీటీ వెల్లడించింది. నోటీసులు జారీ చేసినవారంతా పన్నులు చెల్లించేందుకు అంగీకరించినట్లు సీబీడీటీ తెలిపింది. ప్రత్యక్ష పన్నుల లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేసింది. 2017-18 పన్ను వసూళ్లు మూడో త్రైమాసికం కన్నా ఎక్కువ ఉండవచ్చని అంచనా వేసింది.