సాక్షాత్ ఎంపీకి తప్పని వర్ణ వివక్ష.. ఎస్సీ అని ఊరిలోకి రానియని అగ్రవర్ణాలు... వెనుదిరిగిన దళితనేత
బెంగళూరు : వర్ణ వివక్ష పీక్ స్టేజ్కి చేరుతుంది. చదువుకొనే చోట, పనిచేసే స్థలంలో.. వివక్ష కంటిన్యూ అవుతుంది. వెనుకబడిన వర్గాలను ఉన్నత వర్గాలు ఎప్పుడూ చిన్నచూపు చూస్తారు. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. కానీ సాక్షాత్ ఓ ప్రజాప్రతినిధికి కూడా వివక్ష తప్పలేదు. అదీ కూడా తన సొంత నియోజకవర్గంలో .. బీసీల చేతిలో అవమానం పొందారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని స్థానిక ఎస్పీ పేర్కొన్నారు. తప్పుచేసినవారిని ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
పైకి తేలుతున్న మృతదేహాలు: ధవళేశ్వరం బ్యారేజీ వరకూ కొట్టుకెళ్లినట్టు గుర్తింపు
ఎంపీకి తప్పని వర్ణ వివక్ష
కర్ణాటకలోని తుముకురు జిల్లాలోని చిత్రదుర్గ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించబడింది. ఇక్కడినుంచి బీజేపీ తరఫున ఏ నారాయణస్వామి పోటీ చేసి గెలుపొందారు. కానీ తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన వర్ణ వివక్ష ఎదుర్కొన్నారు. నిన్న తన నియోజకవర్గంలో పర్యటించారు నారాయణ స్వామి. ఫార్మా కంపెనీకి చెందిన సిబ్బంది, వైద్యులతో చిత్రదుర్గ నియోజకవర్గం చుట్టివచ్చారు. అయితే పర్యటనలో భాగంగా తుముకురు జిల్లా పావగడ వద్ద పర్యటిస్తున్నారు. అక్కడినుంచి గోల్లరహట్టి వద్దకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో మంత్రికి ఛేదు అనుభవం ఎదురైంది.
రావొద్దు ..
అక్కడ మంత్రిని గోల్ల కులానికి చెందిన కొందరు అడ్డుకున్నారు. తమ గ్రామంలో అట్టడుగు వర్గాలకు ప్రవేశం లేదని తేల్చిచెప్పారు. దీంతో షాకవడం మంత్రి వంతయిపోయింది. ఎంపీ నారాయణ స్వామి దళితుడు కాగా .. గొల్ల కులానికి చెందినవారు ఓబీసీలు. ఒక్కసారిగా ఎంపీని అడ్డుకోవడంతో అతని అనుచరులు, అధికారులు కూడా షాక్ తిన్నారు. తర్వాత గొల్ల కులానికి చెందిన వారు, ఎంపీ నారాయణ స్వామి బృందానికి వాగ్వివాదం జరిగింది. వారు ఎంతకు ఎంపీని పోనియకపోవడంతో .. ఆయన చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. జరిగిన ఘటనను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.
కేసు నమోదు ..
ఎంపీ నారాయణ స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇన్ స్పెక్టర్తో విచారణకు ఆదేశించామని తెలిపారు. అధికారి అందజేసే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పస్టంచేశారు. ఎంపీని సామాజిక వర్గానికి చెందిన కొందరు అడ్డుకున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ... వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాస్తవానికి చిత్రదుర్గ ఎంపీ నియోజకవర్గం ఎస్సీలకు కేటాయించారు. దీంతో ఎస్సీలే ఇక్కడినుంచి పోటీచేసి గెలుపొందుతారు. వారికి ఓటేసేటప్పుడు లేని కులవివక్ష .. పర్యటిస్తే ఎందుకు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు.