చనిపోయిన చిన్నారి దేవుడి ముందు పెట్టి.. బతికొస్తుందని.. దారుణంగా తల్లిదండ్రుల నిర్వాకం
శాస్త్ర, సాంకేతి పరిజ్ఞానం ఎంత డెవలప్ అయినా కొందరిలో మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గడం లేదు. దేవుడు అని, అభూత కల్పనలను కూడా గుడ్డిగా నమ్మేస్తున్నారు. భగవంతుడి పేరు చెప్పి చనిపోయిన వారి కూడా బతికొస్తారని చూస్తున్నారు. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. దాదాపు నాలుగురోజులు తమ చిన్నారి పార్థీవదేహంతో గడిపిన ఘటన ఆందోళన కలిగించింది.
4 రోజుల నుంచి
యూపీలోని మావ్ జిల్లాకు చెందిన అరవింద్ వాన్వాసి ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తాడు. అతనికి భార్య, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. అతను ఆరేళ్ల క్రితం క్రిస్టియన్ మతంలో చేరాడు. అంతా బాగానే ఉంది. కానీ అతని కూతురు ఈ నెల 14న చనిపోయింది. చనిపోతే దహన సంస్కరాలు జరిపించాలి. కానీ అరవింద్ అలా చేయలేదు. తన స్నేహితులు చెప్పిన మాట విని, ఆ మేరకు నడచుకున్నాడు.
ఇలా చేశారు..
చిన్నారిని జీసస్, బైబిల్ ముందు ఉంచాలని సూచించారు. క్రిస్టియానిటీని నమ్మిన అరవింద్.. వారి సూచనకు ఓకే అని ఆచరించాడు. గత నాలుగురోజుల నుంచి చిన్నారిని జీసస్ ముందు ఉంచాడు. కానీ ఆమెలో కదలిక లేదు. అయితే ఈ విషయాన్ని కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసుల కౌన్సిలింగ్
అరవింద్ ఇంటికి చేరుకున్న ఇన్స్పెక్టర్ అనురాగ్ ఆర్య.. కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు. చనిపోయిన చిన్నారిని ఇలా ఉంచడం సరికాదని సూచించారు. వారి వాదనతో తల్లిదండ్రులు ఏకీభవించారు. చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. కానీ స్థానికంగా మాత్రం ఈ ఘటన కలకలం రేపింది.
ఆరేళ్ల క్రితం మార్పిడి
ఆరేళ్ల క్రితం తాను క్రిస్టియన్ మతంలో చేరానని అరవింద్ తెలిపారు. జౌన్సూర్కి చెందిన పాస్టర్ సమక్షంలో క్రిస్టియన్ మతంలో చేరానని పేర్కొన్నారు. కానీ మత విశ్వాసాల పేరుతో ఇంట్లో శవం ఉంచుకోవడం ఏంటీ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది సరికాదని, వారికి అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.