తండ్రిరూప రాక్షసుడు.. స్కూల్ ఫీజు కట్టమన్నందుకు... కూతురినే....
కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సిన కనురెప్పే చిదిమేసింది. స్కూల్ ఫీజు కట్టమని అడిగినందుకే సైకోలా మారింది. ఆరేళ్ల పసి హృదయం గొంతునులిమి.. పైశాచికంగా ప్రవర్తించింది. తన కన్నతండ్రి మృత్యువుగా మారతాడుకొని ఊహించని ఆ చిన్నారి.. ఊపిరిపోసిన తండ్రిని చూస్తూనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ హృదయ విదారకర ఘటన హర్యానాలో జరిగింది.
ఫీజు కట్టమంటే..
కురుక్షేత్ర జిల్లా డబ్ఖేర గ్రామానికి చెందిన జస్బీర్ సింగ్కు భార్య హర్జిందర్ కౌర్, ఆరేళ్ల కూతురు సుమిత్ ఉన్నారు. జస్బీర్ దినసరి కూలీగా పనిచేస్తుంటాడు. వీరి సంసారం సాఫీగానే సాగిపోతుంది. అయితే స్కూల్ ఫీజు అనే రక్కసి ఓ చిన్నారి నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. ఫీజు కట్టమన్న పాపానికి చిన్నారినే చిదిమేశాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గొంతునులిమి..
సుమిత్ అనే చిన్నారి ప్రైవేట్ పాఠశాలలో చదువుకొంటుంది. ఈ క్రమంలో ఫీజు కట్టమని పాఠశాల యజమాన్యం అడగడంతో తండ్రి జస్బీర్ దృష్టికి తీసుకొచ్చింది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. జస్బీర్ ఒక్కసారిగా పశువుగా మారిపోయాడు. ఫీజు కట్టాలని అడిగిన పాపానికి తన కూతురు అని కూడా చూడలేదు. అత్యంత పాశవికంగా ప్రవర్తించి తండ్రి అనే పదానికి మచ్చ తీసుకొచ్చాడు. చిన్నారి గొంతునులిమాడు.
అడ్డు తొలగించుకోవాలని..
ఫీజు కట్టమని అడిగితే చిన్నారిని మట్టుబెట్టాలనుకొన్నాడు. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారి గొంతుపట్టుకొన్నాడు. ఆమె అరిచిన కనికరించలేదు. చనిపోయేవరకు గొంతునులిమాడు. తర్వాత తన పైశాచికం చల్లారిందో కానీ ఇంటి నుంచి పారిపోయాడు. ఇంటికొచ్చిన సుమిత్ తల్లి చూసి ఒక్కసారిగా షాక్ తింది. తన కూతురు చనిపోయిందని తెలిసి గుండెలవిసేలా రోదించింది. ఎంత పనిచేశావు అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.
పరారీలో రాక్షసుడు..?
తన భర్త జస్బీర్పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు జస్బీర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. చిన్నారి హత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు. జస్బీర్ను పట్టుకొని విచారిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదని చెప్తున్నారు. స్కూల్ ఫీజు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించామని తెలిపారు.