మానవత్వం మంటగలిసింది: సర్కార్ ఆస్పత్రి మంచంపై రోగి, చీమలుపారుతూ, సీఎం సీరియస్
అదో ప్రభుత్వాసుపత్రి.. వైద్యం కోసం పేదలు వస్తుంటారు. ఆ నిరుపేదలు అంటే వైద్యులకు చులకనభావం. కొందరు ప్రబుద్ధులు సరైన వైద్యం కూడా చేయరు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లో జరిగింది. ఓ నిరుపేద రోగి చనిపోతే అక్కడినుంచి తరలించే నాథుడే లేకపోయాడు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరలైంది. దీంతో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్పందించారు. బాధ్యులపై కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ట్రీట్మెంట్ కోసం వస్తే
శివ్పురిలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి బాలచంద్ర లోధి (50) చికిత్స కోసం వచ్చాడు. అతను టీబీ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స తీసుకుంటూనే మంగళవారం చనిపోయాడు. కానీ అతని మృతదేహాన్ని వైద్యులు, సిబ్బంది గాలికొదిలేశారు. పోస్టుమార్టం కోసం తరలించి, శవాన్ని ఇంటికి తరలించే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఈ హృదయ విదారకర ఘటన ప్రతీ ఒక్కరిని కలచివేసింది.
చూసి కూడా
బాలచంద్ర మృతదేహన్ని వైద్యులు, సిబ్బంది చూసీచూడనట్టు వ్యవహరించారు. మంగళవారం చనిపోతే తెల్లవారి కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో బాలచంద్ర మృతదేహంపై చీమలు వెళ్తున్నాయి. కళ్లపై నుంచి చీమలు పోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఇదేమీ నిర్లక్ష్యం అని మృతుడి బంధువులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిని కొందరు ఫోటోలు తీసి.. ట్వీట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
చర్యలు తప్పవు
బాలచంద్ర మృతదేహాన్ని తరలించకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరూ చేసినా చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణకు ఆదేశించామని ఆయన తెలిపారు. అత్యంత సున్నితమైన సమస్య పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటన మానవత్వానికి మచ్చ తీసుకొచ్చిందని కమల్నాథ్ అభిప్రాయపడ్డారు.
టీబీ వ్యాధితో
బాలచంద్ర లోధి టీబీ వ్యాధితో బాధపడుతున్నారు. మంగళవారం శివ్పురి ప్రధాన ఆస్పతిలో చేరారు. ఐదు గంటల తర్వాత చనిపోయారు. కానీ అక్కడి కంపౌండర్, వైద్యులు, ఇతర సిబ్బంది మాత్రం బాలచంద్ర మృతదేహంపై కూడా జాలిచూపలేదు. కానీ తన భర్త పార్థీవదేహంపై చీమలు ఉండడాన్ని భార్య రామ్శ్రీ లోధి తట్టుకోలేకపోయారు. చీమలను తీసివేసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై చర్యలు తప్పవని మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ స్పష్టంచేశారు.