తల్లిరూప రాక్షసి.. కన్నకూతురినే... కిరోసిన్ పోసి... ఆస్పత్రిలో
నవమాసాలు మోసిన తల్లికి కులపిచ్చి పట్టుకుంది. పేగు తెంచుకొని పుట్టిన తన రక్తాన్ని కూడా కాదనుకుంది. కులం పేరు చెప్పి దారుణానికి ఒడిగట్టింది. తన బిడ్డ అని కూడా విచక్షణ చూపలేదు. చేతిలో ఉన్న కిరోసిన్ పోసి.. కర్కశాన్ని చాటుకొంది.
దారుణం..
తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఓ కుటుంబం ఉంటోంది. వివాహితకు 17 ఏళ్ల కూతురు ఉంది. వారి ఓబీసీకి చెందినవారు. అయితే ఇంటి పక్కనే 24 ఏళ్ల దళిత యువకుడు కూడా ఉంటున్నాడు. యువతితో దళిత యువకుడి మధ్య మాట మాట కలిసింది. అలా వారిద్దరూ ప్రేమలో మునిగిపోయారు.
ఓర్వలేని..
తన కూతురు దళిత యువకుడితో సన్నిహితంగా ఉండటం తల్లికి ఎంతమాత్రం ఇష్టం లేదు. దీనిపై తల్లికూతుళ్ల మధ్య చర్చలు కూడా జరిగాయి. మైనర్ అయిన యువతి.. వచ్చే ఏడాది యువకుడితో పెళ్లికి సిద్ధమైందని తెలిసింది. దీంతో తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజమా అని ఆరాతీసింది. అలా వారి మధ్య మాట మాట పెరిగిపోయింది.
హెచ్చరించి..
కూతురు ప్రవర్తన మానుకోవాలని తల్లి సూచించింది. అందుకు యువతి నిరాకరించింది. దీంతో మంగళవారం మాటలు పీక్ స్టేజీకి చేరిపోయాయి. కూతురుపై ద్వేషంతో ఉన్న తల్లి కిరోసిన్ పోసి బెదిరించింది. యువకుడిని మరచిపోవాలని హెచ్చరించింది. అందుకు యువతి నిరాకరించడంతో నిప్పు అంటించింది. తీవ్రగాయాలైన యువతిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రిలో చికత్స పొందుతూ యువతి కన్నుమూసింది.
పెళ్లి అని చెప్పడంతో
వారిద్దరూ పెళ్లి చేసుకుంటామని చెప్పడంతోనే యువతి తల్లి దారుణానికి ఒడిగట్టింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువతి ఓబీసీ కాగా.. దళితుడు కాబట్టే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడలేదని తెలుస్తోంది. యువతి మృతిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని ఎస్పీ మురుగవేల్ తెలిపారు.
ఫిర్యాదు రాలేదే..
తాము ప్రేమించుకోవడంతోనే దారుణానికి ఒడిగట్టారని యువకుడు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఘటనకు సంబంధించి బాలిక బంధువులతో మాట్లాడుతున్నామని చెప్పారు. ద్వేషంతోనే దాడి జరిగినట్టు వారు చెప్పలేదని పేర్కొన్నారు. అయితే తమ ప్రేమ వల్లే దారుణానికి ఒడిగట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశానని దళిత యువకుడు చెప్పడం గమనార్హం. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామని యువకుడు తెలిపారు.