అందుకే.. పోలీసులకు స్నానం చేయించిన మహిళలు!
లక్నో: తమ పాడి పంటలు బాగుండాలని, సకాలంలో వర్షాలు కురియాలని ప్రార్థిస్తూ.. అక్కడి మహిళలు పోలీసులకు స్నానాలు చేయిస్తారు. వర్షాల కోసం పోలీసులకు స్నానాలు చేయించడమేంటని అనుకుంటున్నారా? అవును, ఇక్కడ అంతే. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రజలకు ఆచారంగా మారిన నమ్మకం.
ఈ ఆచారంలో భాగంగానే సిద్ధార్థనగర్ జిల్లాలోని మహిళలు సమీపంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి.. పోలీసులను బయటికి పిలుస్తారు. ఆ తర్వాత వారు తెచ్చిన బిందెల కొద్ది నీటిని వారిపై పోసి స్నానం చేయిస్తారు.
జిల్లాను పాలించేవారికి స్నానం చేయిస్తే.. ఆ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయనేది గ్రామస్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పంటలు నాశనం కావడంతో పదుల సంఖ్యలో వచ్చిన మహిళలు స్థానిక సీనియర్ ఇన్స్పెక్టర్ రణ్ విజయ్ సింగ్కు బిందెలకొద్దీ నీళ్లు కుమ్మరించి స్నానం చేయించారు.
అయితే కొందరు పోలీసులు మాత్రం మహిళల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రణ్ విజయ్ సింగ్ మాత్రం ప్రజల నమ్మకాలను గౌరవించి వారిచే స్నానం చేయించుకున్నారు.