వికారం పుట్టించేలా మోడీ ‘మంత్రాలు, చేతబడి’ వ్యాఖ్యలు - 15ఏళ్ల పాలనపై చెప్పుకోలేక: తేజస్వీ ఫైర్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 'మంత్రాలు, చేతబడి' ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆరోపించడం దుమారం రేపుతున్నది. సదరు వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయని, అంతటి మోదీ ఇంతటా దిగజారి మాట్లాడుతారనుకోలేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు.
శంకర్ చరణ్ త్రిపాఠి అనే తాంత్రికుడితో లాలూ ప్రసాద్ క్షుద్రపూజలు, చేతబడులు చేయిస్తారని, మూడేళ్ల కిందట మంత్రాలతో తనను చంపేందుకు ప్రయత్నించారని, తర్వాతి కాలంలో త్రిపాఠిని ఆర్జేడీ జాతీయ ప్రతినిధిగానూ నియమించారని, అతను చెప్పడం వల్లే లాలూ తెల్ల కుర్తాలు ధరించడం మానేశారని, ప్రస్తుతం జైల్లో ఉన్న లాలూ దసరా రోజున మూడు మేకల్ని బలి ఇవ్వబోతున్నారంటూ సుశీల్ మోదీ ఆదివారం వరుస ట్వీట్లతో కలకలం రేపారు. దీనిపై..
నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీ
సుశీల్ మోదీ కామెంట్లపై లాలూ యాదవ్ కుమారుడు, ప్రస్తుత మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఘాటుగా స్పందించారు. ''చిన్న మోదీ వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయి. ఆయన నోటి వెంట ఇలాంటి కామెంట్లు వస్తాయని ఊహంచలేదు. బీహార్ లో నిరుద్యోగం, పరిశ్రమలు, విద్య, వైద్యంపై ఆయన మాట్లాడాల్సింది.
కనీసం తమ 15 ఏళ్ల పాలనలోని గొప్పదనం గురించైనా ప్రజలకు చెప్పాల్సింది. అలా కాకుండా తాంత్రికం గురించి మాట్లాడుతున్నారంటే చెప్పుకోడానికి ఏమీ లేదనే కదా అర్థం'' అని తేజస్వీ ఎద్దేవా చేశారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఈనెల 28న తొలి దశ, నవంబర్ 3, నవంబర్ 7న మలి, తుది దశ పోలింగ్ జరుగనుంది.