వెంకయ్యకు మద్దతివ్వలేం: బీజేపీకి నవీన్ పట్నాయక్ షాక్
బీజేపీకి బీజూ జనతాదళ్(బీజేడీ) షాకిచ్చింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కు ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీకి బీజూ జనతాదళ్(బీజేడీ) షాకిచ్చింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్కు ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. కానీ, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు విషయంలో మాత్రం తమ మద్దతు ఉండబోదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీనే తాము బలపరుస్తామని నవీన్ పట్నాయక్ తేల్చి చెప్పారు. మంగళవారం భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ తనకు చిరకాల మిత్రుడని చెప్పారు.
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము స్నేహితులమని గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేడీకి పార్లమెంటులో 28మంది ఎంపీలున్నారు. ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు కూడా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీజేడీ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
బీజేడీ నిర్ణయం వెనుక కాంగ్రెస్ హస్తముందని, వీరి మధ్య తెరవెనుక ఒప్పందం కుదిరిందని ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బసంత పండా ఆరోపించారు. కాగా, బీజేడీ మాత్రం తాము బీజేపీకి ఎంత దూరంగా ఉన్నామో, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతేదూరమని చెప్పుకొస్తోంది.