ఎన్డీఏ వైపు బీజేడీ చూపు : నవీన్తో బీజేపీ నేతల సంప్రదింపులు, చంద్రబాబు, కేసీఆర్కు షాక్
లక్నో : ఎగ్జిట్ పోల్ అంచనాలతో బలబలాల సమీకరణాలు జోరందుకున్నాయి. ఎన్డీఏ, యూపీఏ కూటమి పక్షాలు కానీ పార్టీలు ఏ వైపు వెళ్లాలో నిర్ణయించుకుంటున్నాయి. ఈ రెండు కూటమిలు కూడా తమతో దూరంగా ఉంటున్న పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఫెడరల్ ఫ్రంట్లో కీ రోల్ పోషించాల్సిన బీజేడీ కూడా ఎన్డీఏ వైపు అడుగులు వేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్డీఏ వైపు బీజేడీ చూపు
ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందనే సర్వే లెక్కలతో .. ప్రతిపక్ష పార్టీలు అలర్టయ్యాయి. తమతో కలిసి, మధ్యేమార్గంగా ఉన్న పార్టీలతో జోరుగా మంతనాలు సాగిస్తోంది. అయితే ఒడిశాలో స్థానిక పార్టీ బిజు జనతాదళ్ మాత్రం ఎన్డీఏ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ అగ్రనేతలు, బీజేడీ హై కమాండ్తో చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. జరుగుతున్న ఊహగాలకు క్లారిటీ ఇచ్చారు బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. కేంద్రంలో ఏర్పడే ఒక ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఒక పార్టీ, వివిధ అంశాలతో కూడిన కూటమికి మద్దతిస్తామని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే దీనికి ఆయన ఒక షరతు కూడా విధించారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం ఒడిశాలో పరిష్కారం కానీ సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే సపోర్ట్ గురించి ఆలోచిస్తామని తేల్చిచెప్పారు.
షాక్ ఇస్తారా ?
ఎగ్జిట్ పోల్ ఫలితాల బీజేడీ వైఖరితో మిగతా నేతలు షాక్ తిన్నారు. ఎన్డీయేతర కూటమి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు .. ఇప్పటికే నవీన్ పట్నాయక్తో మాట్లాడారు. తామంతా కలిపి కూటమి ఏర్పడాలనే అంశంపై స్పష్టతనిచ్చారు. ఇందుకోసం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్తో చర్చలు జరిపారు. అయితే తాజాగా బీజేడీ ఎన్డీఏ వైపు చూడటంతో .. చంద్రబాబు ప్రయత్నాలకు గండికొట్టినట్లవుతుంది. అయితే దీనిపై ఇటు టీడీపీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇబ్బందికర పరిస్థితే ?
చంద్రబాబుతోపాటు ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్, పినరయి విజయన్ తో మలివిడత సమావేశమై ... ఫ్రంట్ ఏర్పాటు, ఆవశ్యకత గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు. ఇదివరకే మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, మాయావతి తదితరులతో సమావేశమై .. ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో నవీన్ పట్నాయక్ తాజా ఎత్తుగడ ఇటు కేసీఆర్ను కూడా ఇబ్బంది పెడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.